అనంతపురం, డిసెంబర్ 6, (వాయిస్ టుడే): అనంతపురం సిటీ లో దృశ్యం సినిమా తరహాలో యువకుడి మర్డర్ కలకలం రేపింది. డబ్బు అడిగిన స్నేహితుడిని సుపారి గ్యాంగ్ తో అంతమొందించి ఆధారాలు లేకుండా చేయాలని భావించారు. కానీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయారు. వివరాలు.. బెంగళూరుకు వెళ్లిన తన కుమారుడు మహమ్మద్ అలీ తిరిగి ఇంటికి రాలేదని అనంతపురం సిటీ మున్నానగర్కు చెందిన పాపాసాబ్ ఇబ్రహీం వన్ టౌన్ పోలీసులకు ఈనెల 1వ తేదీన ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పక్కా సమాచారంతో ప్రధాన అనుమానితుడైన మహమ్మద్ రఫీక్ ను స్థానిక వినాయకనగర్ వద్ద అరెస్టు చేశారు. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు మహమ్మద్ రఫీ, హత్యకు గురైన మహమ్మద్ అలీ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం, పాల్కాన్ ఎక్స్పోర్ట్ & ఇంపోర్ట్ ట్రేడింగ్ కంపెనీ ఇలా రకరకాల వ్యాపారాలు కలిసి చేశారు. లక్షల్లో నష్టపోయారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో మహమ్మద్ అలీ వ్యాపారాల్లో తాను పెట్టిన డబ్బును తిరిగి చెల్లించాలని తరుచూ అడిగేవాడు.అంతే కాకుండా మహమ్మద్ రఫీక్ ఇంట్లో లేనప్పుడు మహమ్మద్ అలీ తరుచూ స్నేహితుడికి ఇంటికి వెళ్లేవాడు. కుటుంబ సభ్యులతో ప్రవర్తించే తీరు మహమ్మద్ రఫీ నచ్చలేదు. దీంతో అలీని చంపేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని భావించాడు. తన స్నేహితుడైన మంగళ కేసన్నగారి రాము అలియాస్ శివరాం సాయం కోరాడు. అందుకు అంగీకరించిన శివరాం రూ. 50 వేలు అడ్వాన్సు తీసుకుని గుజ్జల శివ కుమార్, గుజ్జల చంద్ర శేఖర్, గుజ్జల హరి, గుజ్జల కృష్ణలను అనంతపురం పంపించాడు. మహమ్మద్ రఫీ బావ షేక్ సిద్ధిక్ అలీకి చెందిన ఫర్నీచర్ గోడౌన్కు మహమ్మద్ అలీను పిలిచి హత్య చేశారు.డెడ్ బాడీ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మహమ్మద్ రఫీక్, కరిష్మాలు ప్లాన్ చేశారు. కారులో డెడ్ బాడీని కారులో తరలించి ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లమల్ల అడవుల్లో కాల్చివేయాలని స్కెచ్ వేశారు. తాడిపత్రి, బుగ్గ, జమ్ములమడుగు మీదుగా ప్రొద్దుటూరు వెళ్లగానే కారు మరమ్మతులకు గురైంది. అక్కడి నుంచి తిరిగి అనంతపురంలోని నారాయణపురం ఇందిరమ్మ కాలనీలో మహమ్మద్ రఫీక్ నిర్మిస్తున్న కొత్త ఇంటికి తీసుకెళ్లారు. అతి దగ్గర బంధువు చనిపోయాడని, కుష్టు వ్యాధి ఉండటంతో అక్కడికి తీసుకొచ్చామని చుట్టు పక్కల వారిని కూడా నమ్మించారు. 28వ తేదీ అర్ధరాత్రి దాటాక ఆ శవాన్ని నారాయణపురం సమీపంలోని శ్మశాన వాటికకు తీసికెళ్లి పెట్రోలు పోసి ఆనవాళ్లు లేకుండా కాల్చేశారు. హత్యకు సహకరించడం, కారును దాచడంలో షాహీనా, కరణం శ్రీనివాస్ ఫణీల పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రధాన నిందితులు షేక్ కరిష్మా, షేక్ గౌసియా, షేక్ సిద్ధిక్ అలీని స్థానిక మిర్చి యార్డు వద్ద, మిగతా ఐదుగురు నిందితులను బత్తలపల్లిలో అదుపులో తీసుకుని విచారించాక అరెస్టు చేశారు. మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేసి. కారు, రెండు బైకులు, ల్యాప్టాప్, ఐదు సెల్ఫోన్లు, రూ. 35 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.



