ఆడపిల్లను పుట్టనిద్దాం.. చదవనిద్దాం
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
కర్నూలు,
బాలికలను “పుట్టనిద్దాం, బతకనిద్దాo, చదవనిద్దాం, ఎదగనిద్దాం” అనే భావనతో బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు..
బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ బాలిక దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి మనుషుల ఆలోచనా విధానంలో ఆడపిల్ల అంటే కేవలం బానిసత్వం, బరువుగా చూసే మనస్తత్వం నుండి బయటికి వచ్చే ప్రయత్నాలలో భాగంగానే ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.. ప్రతి ఒక్కరు ఈరోజు యొక్క ప్రాముఖ్యతను, పునరంకితం అవ్వాల్సిన అవసరాన్ని, రోజు మనం చేసే పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని బాలికా దినోత్సవం చాటి చెబుతుందన్నారు. తెలిసీ తెలియని అమాయకత్వంతో కొంతమంది ఆడపిల్లలు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు..ప్రతిరోజు మన జీవితం పోరాటమే అని, పోరాటానికి ఏ రోజైతే భయపడో, తెలిసి తెలియకో వదిలేస్తామో ఆరోజు మన అస్తిత్వాన్ని కోల్పోయి భవిష్యత్తు లేని వారవుతామనే విషయాన్ని ప్రతి రోజు గుర్తు చేసుకోవాలని అమ్మాయిలకు సూచించారు.. మన అస్తిత్వాన్ని మనమే పోరాటం చేసి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంట్లో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ప్రతి రోజూ బ్రతకడానికి, పేదరికంతో సంబంధం లేకుండా పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. సమాజం లో భద్రత లేదని, ఆర్థిక భారం కుటుంబం మీద పడుతుందేమో అనే ఆలోచన కారణాలతో భ్రూణ హత్యలు చేయిస్తున్నారని, ఆడపిల్లలకు చిన్నప్పటినుండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటివి నేర్పించినట్లయితే ఏ చిన్న అపాయం మన దగ్గరికి వచ్చినా గాని సహాయం అందించగలిగే స్థాయికి ఎంపవర్ చేయగల్గితే భద్రత లేని సమాజం యొక్క సమస్యలను పరిష్కరించిన వాళ్ళమవుతామన్నారు..
అబ్బాయితో పాటు అమ్మాయిలు సమానంగా చదువుకొని, ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడితే, ప్రతి అమ్మాయి కుటుంబ బాధ్యత తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.. ఇందుకు నిదర్శనం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ అని అన్నారు.. చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడినప్పుడు, ఆర్థిక స్వావలంబన కలిగినప్పుడు తల్లితండ్రుల యోగక్షేమాలను, పిల్లల చదువులను ఆడపిల్ల చూసుకున్న విధంగా కొడుకులు చూసుకోలేరని, ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను బాగా చదివించి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా చూసుకోవాలన్నారు.. రానున్న తరాలకు ధైర్యంతో పాటు, పోరాట స్ఫూర్తిని కూడా కలిగించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.. వేల సంవత్సరాలుగా మహిళలను తక్కువ తక్కువ అని ఏ విధంగా అయితే మభ్య పెడుతున్నారో, మేము తక్కువ కాదు అని కృషి చేస్తే తప్ప ఇటువంటి బాలికా దినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉండదని, లేదంటే ఇంకా వంద సంవత్సరాలు వచ్చినా బాలికల దినోత్సవాలు జరుపుకుంటూనే ఉంటామన్నారు.. ఎంతోమంది డబ్బున్న కుటుంబాలలో కూడా అబ్బాయిలకి ఇచ్చిన ప్రాముఖ్యత అమ్మాయిలకు ఇవ్వరని, ఎంతసేపు అమ్మాయిలను పెళ్లి చేసి పంపించాలనే ఆలోచనలో ఉంటారే తప్ప వారిని వారి కాళ్ళ మీద ఉద్యోగం చేస్తూ నిలబడి ఆర్థికంగా బలవంతులను చేయాలన్న ఆలోచన మాత్రం చేయరన్నారు. అమ్మాయిలకు ఏ విధంగా అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పిస్తారో అదే విధంగా అబ్బాయిలకు సైతం నేర్పించాలన్నారు. మన జీవితం మరో అమ్మాయికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఉండాలని, మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందని, మన హక్కుల కోసం ఎంతోమంది పోరాడారని, వారి త్యాగాలు అన్నిటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓటింగ్ హక్కు కొన్ని సంవత్సరాలు పోరాడితే వచ్చిందని, జీవించే హక్కు కూడా చాలా సంవత్సరాలు పోరాటం చేస్తే వచ్చిందని వీటన్నిటిని గుర్తుపెట్టుకోకపోతే బాధ్యతా రాహిత్యం అనిపించుకుంటుందన్నారు.. మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అప్పుడే చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మార్చగలుగుతాము అనే విషయాలను ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని ప్రతిరోజు బాలికా దినోత్సవం జరుపుకోలేము కనుక ఈరోజు బాలికల దినోత్సవంలో ఏ విషయాలు అయితే చర్చించామో ఆ విషయాలను ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని హాజరైన మహిళలకు కలెక్టర్ సూచించారు..
CWC చైర్మన్ జుబేదా మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని 2008 సంవత్సరం నుండి నిర్వహించినప్పటికి కూడా ఇంకా అనుకున్న స్థాయిలో సమాజంలో మార్పు రాలేదన్నారు.. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇక్కడ హాజరైన తల్లులు, అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించడం జరుగుతుందన్నారు.. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా మెరుగుగా ఉందని ఎందుకంటే ఈ రోజు ఈ స్టేజ్ మీద ముఖ్య అతిథులలో 10 మంది కంటే ఎక్కువ మహిళలే ఉన్నారని అందులో మరి ముఖ్యంగా కలెక్టర్ మహిళ ఉండడం విశేషమన్నారు.. ప్రతి రోజూ ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళ దేవతలకు పూజిస్తారని అయితే ఇంట్లో ఉన్న మహిళలకు మాత్రం ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వరనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉందన్నారు?? పాఠశాలలల్లో ప్రైమరీ లెవల్ వరకు ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటివి అవగాహన కల్పించాలన్నారు.. ప్రతి ఒక్క బాలిక ఇరవై ఒక్క సంవత్సరం వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలని, మైనర్ బాలిక లకు వివాహం చేయడం చట్టపరమైన నేరంగా భావించడం జరుగుతుందని పేర్కొన్నారు.
సెక్సువల్ హెరాస్మెంట్ కమిటీ చైర్మన్ మాధవి శ్యామల మాట్లాడుతూ ఆడపిల్లను రక్షిదాo – ఆడపిల్లను చదివిదాo అనే స్లోగన్ తో జాతీయ బాలిక వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు..
ఆడపిల్లల హక్కుల గురించి చైతన్యం కల్పించడం, బాలిక విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం వంటివి జాతీయ బాలికల దినోత్సవ ముఖ్య లక్ష్యాలన్నారు. ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ బాగా చదువుకొని డాక్టర్లు, కలెక్టర్లు లాంటి ఉన్నత హోదాలో ఉండాలన్నారు… బాగా చదువుకొని ఒక ఉన్నత స్థానంలో ఉండడంతో ఒక్కరి మీద ఆధార పడల్సిన అవసరం ఉండదన్నారు…
దిశా డిఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలకు ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలు జరుగుతున్నాయని అటువంటి తరుణంలో దిశా తరుపున ఇక్కడ హాజరైన వారికి కొన్ని సూచనలు ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వడంతో మంచి జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.. తల్లిదండ్రులు ఎంతసేపు ఉన్నా అమ్మాయిలను బయటికి వెళ్లొద్దు, తిరగొద్దు అనే నియమాలు పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్న కొడుకుకు అమ్మాయిల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఏ ఏ అలవాట్లకు దూరంగా ఉండాలనే విషయాలను చెప్పి సక్రమంగా పెంచినట్లైతే సమాజంలో ఎటువంటి హాని కలగకుండా చైతన్యంగా ఉంటుందన్నారు..
తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు..
అనంతరం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోలు అందించారు.. తదనంతరం “నేటి ఆడపిల్ల రేపటి అమ్మ” అనే బ్రోచర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు…
కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ , పిసి పి ఎన్ డి టి నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్, డెమో ప్రమీల తదితరులు పాల్గొన్నారు.




