దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా వెళ్లారు. వీరిద్దరూ కుటుంబసమేతంగా ఆ నగరంలో పర్యటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు.
‘‘కుటుంబసభ్యులతో కలిసి ఈ రోజు అయోధ్య వెళ్లిన నాకు రామ్లల్లాను దర్శించుకునే భాగ్యం కలిగింది. మాతోపాటు భగవంత్జీ, ఆయన కుటుంబం కూడా అయోధ్యలో పర్యటించారు. దేశ పురోగతి, మానవాళి సంక్షేమం కోసం మేమంతా ప్రార్థించాం. శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. జై శ్రీరామ్’’ అని పోస్టు పెట్టారు.
జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాను హాజరుకానని అప్పుడు కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రారంభోత్సవానికి ట్రస్ట్ వారు నాకు లేఖ పంపారు. నన్ను అధికారికంగా ఆహ్వానించడానికి ఒక బృందం వస్తుందని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని చెప్పారు. మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక అంశాలపై గౌరవం ఉందని, ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయడం సరికాదని భాజపాను దుయ్యబట్టారు. జనవరి 22 తర్వాత సమయం చూసుకుని తాను కుటుంబంతో కలిసి అయోధ్యను దర్శిస్తానని కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే
అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు
- Advertisement -
- Advertisement -



