ఆదర్శ ఉపాధ్యాయిని పార్వతీ దేవి!
ఉద్యోగ విరమణ సభలో
పలువురు వక్తల ప్రశంసలు
గణపవరం:
విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా వృత్తి నిబద్ధతతో కృషిచేసిన ఆదర్శ ఉపాధ్యాయిని జి. పార్వతీ దేవి సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు అభినందించారు.
పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం అగ్రహార గోపవరం గ్రామంలో యూపీ పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఎ .పి.టి.ఎఫ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి. పార్వతీదేవి అభినందన సభను సోమవారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
మండల విద్యాశాఖాధికారి పి.శేషు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ పార్వతీదేవి గోపవరం యూపీ స్కూలుకు వచ్చి ఏడాది మాత్రమే అయినప్పటికీ పాఠశాలలో నమోదును పెంచడానికి , అభ్యసనం మెరుగు పరచడానికి , పిల్లలో క్రమశిక్షణ పెంచడానికి చక్కటి తోడ్పాటు అందించారని , మిగిలిన ఉపాధ్యాయ సిబ్బందికి అన్నివిధాలా అండగా నిలిచారని అన్నారు. ఆమె ఉద్యోగ విరమణ చేయడం విద్యాశాఖకు లోటని అయితే ఆమెను ఆదర్శంగా తీసుకుని పాఠశాల పురోభివృద్ధికి మిగిలిన ఉపాధ్యాయ సిబ్బంది కృషిచేయాలని కోరారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి. సోమసుందర్ మాట్లాడుతూ మంచి ఉపాధ్యాయినిగా , ఉపాధ్యాయ నేతగా , సామాజిక కార్యకర్తగా పార్వతీదేవి సమాజానికి విశేష సేవలు అందించారని అన్నారు.
తాడేపల్లిగూడెం పట్టణం 31 వ వార్డులో విద్యాపరంగా బాగా వెనుకబడిన ప్రాంతంలో ఎయిడెడ్ పాఠశాలలో ముప్పై ఏళ్లపాటు పార్వతీదేవి ప్రధానోపాధ్యాయినిగా పనిచేశారని, పాతిక కంటే తక్కువ ఉన్న నమోదును 205 కు పెంచారని , స్థానిక ప్రజల సహకారంతో పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారని డి. సోమసుందర్ ప్రశంసించారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి ఎంతో శ్రమించారన్నారు. విద్యా ప్రమాణాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ప్రథమ్ సంస్థ ప్రతి ఏటా నిర్వహించే అసర్ సర్వే కార్యక్రమంలో జిల్లా మాష్టర్ ట్రైనర్ గా కూడా ఆమె సేవలు అందించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బి.వి. నారాయణ మాట్లాడుతూ చక్కని విద్యా బోధన ద్వారా మంచి పేరు తెచ్చుకున్న పార్వతీ దేవి ,ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంకోసం జరిగిన పోరాటాలలో కూడా చురుగ్గా పాల్గొన్నారని , సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ఉద్యోగ విరమణ చేసినా ఉపాధ్యాయ ఉద్యమానికి పార్వతీ దేవి తమ సేవలను కొనసాగించాలని కోరారు.
ఎమ్ ఈ వో -2 బి.బాలయ్య, ఏ.పి.టి.ఎఫ్. మండల శాఖ అధ్యక్షుడు
ఎం.విజయబాబు, తాడేపల్లిగూడెం పట్టణ శాఖ అధ్యక్షుడు
లంకా రాజు, అనుబంధం ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాడిమి అచ్చిబాబు, అగ్రహార గోపవరం యూపీ స్కూలు ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు నక్కా రాంబాబు, ఉపాధ్యాయులు శ్రీమతి కే. కెంపు రత్నం, మద్దాల జగన్నాథ స్వామి, కే.మాణిక్యాల రావు., పి.రాంబాబు. తదితరులు మాట్లాడారు.
ఉద్యోగ విరమణ చేసిన జి.పార్వతీ దేవి ని మండల విద్యాశాఖ తరపున విద్యాశాఖాధికారులు పి శేషు, బి. బాలయ్య ఘనంగా సత్కరించారు. సహ ఉపాధ్యాయులు , ఉపాధ్యాయ నేతలు , స్నేహితులు పార్వతీ దేవిని శాలువాలు , పూలమాలలతో సన్మానం చేశారు. పార్వతీ దేవి కృతజ్ఞతలు తెలిపారు.