- Advertisement -
కేదార్ నాధ్ లో చిక్కుకున్న యాత్రికులు
Pilgrims stuck in Kedarnathడెహ్రాడూన్, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్)
ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తరాఖండ్లోని కేదారనాథ్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. ఈ నెల 11 నుంచి వారు అక్కడే చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా దాదాపు 18 మంది వెళ్లగా.. కేదార్నాథ్ దర్శనం తర్వాత వీరిలో 14 మంది తిరుగుపయనమయ్యారు. నలుగురు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడగా కేదార్నాథ్ – బద్రీనాథ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిజామాబాద్కు చెందిన ఇద్దరు, విజయనగరానికి చెందిన ఇద్దరు యాత్రికులు కేదార్నాథ్లోనే ఉండిపోయారు. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ హెలికాఫ్టర్ సర్వీసులు నిలిపేశారు. ఈ క్రమంలో వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్నారు.అటు, కేదార్నాథ్లో చిక్కుకున్న యాత్రికులతో టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్లో మాట్లాడారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని భరోసా ఇచ్చారు. అధికారులతో మాట్లాడామని.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. యాత్రికుల ఇబ్బందులపై కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్తో కలిశెట్టి మాట్లాడారు. వారిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. యాత్రికులు పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని.. వారిని హెలికాఫ్టర్లో తరలించాలని కోరారు.
- Advertisement -




