పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం
Not Petdandarlam.. Prajasevakulam‘పీపుల్ ఫస్ట్’ మన విధానం
హెల్తీ, వెల్తీ, హ్యాపీ మన నినాదం
మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం
వైసీపీ హయాంలో పోర్టులు, సెజ్లు కూడా కబ్జా
గూగుల్తో ఎంవోయూ గేమ్ చేంజర్
13న స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ విడుదల
పాలనలో మరింత వేగం పెంచుదాం
రెండవ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, డిసెంబర్ 11
రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్లర్లతో అన్నారు. ప్రజా సమస్యలను ఒక అధికారిలా కాకుండా.. మానవతా కోణంలో చూడాలని చెప్పారు. ప్రజలతో మన ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా అభినందిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవడం, ప్రజల వినతుల వేగంగా పరిష్కరించడం అధికారుల ప్రథమ ప్రాధామ్యాలుగా ఉండాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన 6 నెలల పాలనపైనా, భవిష్యత్ ప్రణాళికలపైనా చర్చించారు.
మార్పు మొదలైంది.. వెలుగులు చూస్తున్నాం :
ఆరు నెలల్లో మనమంతా రెండోసారి సమావేశం అయ్యామని అయితే మొదటి సమావేశానికి రెండవ సమావేశానికి స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. మొదటి సమావేశం నాటికి రాష్ట్రంలో చీకట్లు నెలకొనగా, అవి మెల్లిగా పోయి రెండో సమావేశం కల్లా వెలుగు రావడం మొదలైందని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాన్ని నడిపించడం సులభంగానే ఉంటుందని, విధ్వంసం జరిగిన రాష్ట్రంలో పాలన సాగించాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం రూ. పది లక్షల కోట్ల పైనే అప్పులు-బకాయిలు మిగిల్చి వెళ్లడమే కాదు, రెండేళ్ల పాటు రాష్ట్రానికి వచ్చే నిధులను ముందుగానే వాడేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, సంక్షేమం-అభివృద్ధి వైపు వడిగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. గత పాలకులు పోర్టులు, సెజ్లు కూడా కబ్జా చేశారని.. ఇలా అన్నింటినీ ఒకొక్కటిగా సరిదిద్దుతున్నామని.. ఇందులో జిల్లాల కలెక్టర్లు చురుకైన పాత్ర పోషించాలని చెప్పారు. పీ 4 పాలసీ, జీరో పావర్టీ, ఉద్యోగాలకల్పన, జనాభావృద్ధి, జల సంరక్షణ, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించడం – రైతులకు లాభాలు పెంచడం.. తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు.



