స్వచ్ఛాంధ్ర సాధన మన బాధ్యత
Swachandhra Sadhana is our responsibilityపట్టణంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమం
పాల్గొన్న ఎంపీ కలిశెట్టి, ఎంఎల్ఏ అదితి
విజయనగరం, జనవరి 18 ః
స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇది మన బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. స్వఛ్చాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కోట వద్ద శనివారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్ఏ అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. చీపుళ్లతో రోడ్లను శుభ్రం చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు. కోట జంక్షన్ వద్ద మానవహారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మొత్తం 777 గ్రామ పంచాయితీలు,అన్ని మున్సిపల్ వార్డుల్లో వివిధ వర్గాల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలూ పాల్గొనే విధంగా ఆదేశాలను జారీ చేశామన్నారు. ఇకనుంచీ ప్రతీనెలా ఒక కొత్త అంశంతో 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పౌరుల బాధ్యత అని స్పష్టం చేశారు. మన ప్రాంతాన్ని పరిశుభ్రం చేసుకోవడం ద్వారా, మన ఆరోగ్యంతోపాటు, తోటివారి ఆరోగ్య పరిరక్షణకు సైతం కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, ప్రజలంతా స్వచ్ఛందంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మన మనస్సును, శరీరాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పౌరులుగా మన విధి అని పేర్కొన్నారు. కరోనా లాంటి చేదు జ్ఞాపకాలను స్మురణకు తెచ్చుకొని ఆరోగ్యకర సమాజాన్ని సాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎంఎల్ఏ అదితీ విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, మన అలవాట్లు, సంప్రదాయంలోనే పరిశరాల పరిశుభ్రత ఇమిడి ఉందని అన్నారు. ప్రతిరోజూ ఇళ్లూ, వాకిలి సుభ్రం చేయడం మనకు అలవాటని పేర్కొన్నారు. ఇదే విధంగా పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. మంచి ఆరోగ్యం, పరిశుభ్రమైన నీరు మనకు అందాలని అన్నారు.
రాష్ట్ర తూర్పుకాపు ఛైర్ పర్సన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ, మన ఇళ్లు, పరిసరాలు, రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా ఉండాలన్న గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రేపటి తరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నది దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి కల్యాణచక్రవర్తి, డిపిఓ టి.వెంకటేశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, బిసి సంక్షేమాధికారి పెంటోజీరావు, డిపిఆర్ఓ డి.రమేష్, ఎపిఎంఐపి పిడి లక్ష్మీనారాయణ, డిప్యుటీ సిఈఓ రామన్, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్రావు, రెడ్ క్రాస్ ఛైర్మన్ ప్రసాదరావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.



