ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
ఆపరేషన్ సిందూర్ వీడియోలు రిలీజ్ చేసిన భారత్ ఆర్మీ
న్యూఢిల్లీ, మే 7, (వాయిస్ టుడే)
Indian Army releases Operation Sindoor videos
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన 15 రోజుల తర్వాత, భారత సైన్యం తన శక్తిని ప్రదర్శించి, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ వైమానిక దాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం, సన్నిహితులు సహా అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. భారత ప్రభుత్వం బుధవారం ఆపరేషన్ సిందూర్ వీడియో, ఫోటోగ్రాఫిక్ ఆధారాలను విడుదల చేసింది.సైనిక అధికారులు ఉగ్రవాద స్థావరాలపై దాడికి సంబంధించిన క్లిప్లను కూడా చూపించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్టు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేశారు. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇవి పాకిస్తాన్, పీఓకే రెండింటిలోనూ విస్తరించి ఉన్నాయి.
కల్నల్ సోఫియా ఖురేషి ప్రెస్ మీట్లో ఏం చెప్పారు?
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, POJKలో మొదటి లక్ష్యం ముజఫరాబాద్లోని సవాయి నాలా క్యాంప్ అని చెప్పారు. ఇది నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది లష్కరే తోయిబా శిక్షణా కేంద్రం. 2024 అక్టోబర్ 20న సోనామార్గ్, 24 అక్టోబర్ 2024న గుల్మార్గ్, 22 ఏప్రిల్ 2025న పహల్గామ్లో జరిగిన దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు.
ఈ దాడి తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 గంటల మధ్య జరిగిందని వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతం అయ్యాం. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా టార్గెట్స్ను ఫిక్స్ చేశాం. పహల్గామ్ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ ప్రకటించుకుందని అన్నారు. ఈ సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉంది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని తేలింది. పహల్గామ్పై జరిగిన దాడి పిరికిపంద చర్య అని, పహల్గామ్ దాడి దర్యాప్తులో పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలను స్పష్టమయ్యాయని అన్నారు.ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న మా నిఘా సంస్థలు భారతదేశంపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సూచించాయని, వాటిని నిరోధించడం, ఎదుర్కోవడం అవసరమని భావించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.ఈ ఉదయం, సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించేలా భారత్ స్పందించిందని అన్నారు. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు నాశనం చేయడంపై దృష్టి పెట్టాం. ఈ ప్రెస్ మీటింగ్ ప్రారంభంలో, 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడి, ఉరి, పుల్వామా, పహల్గామ్ దాడులతో సహా భారతదేశంపై జరిగిన అనేక దాడులకు సంబంధించిన క్లిప్ను కూడా చూపించారు



