కేసులకు, జైళ్లకు భయపడితే రాజకీయాలు చేయలేము
విజయవాడ, మే 20
We cannot do politics if we are afraid of cases and jails.
కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదని, అలా అయితేనే రాజకీయాలు చేయగలమని చెప్పారు. వివిధ స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆయన తీరు ఇలాగే ఉందని చెప్పారు. తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి ప్రయత్నంచేస్తోందని తెలిపారు.మెజార్టీ వైఎస్సార్సీపీకి ఉందంటే ఎన్నికను ఆపుతున్నారని, పోలీసులు వైసీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారని జగన్ చెప్పారు. టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారని తెలిపారు. కొడతానంటూ దూసుకొస్తే కొట్టమనండని తమ నేతలు, కార్యకర్తలకు జగన్ సూచించారు.అయితే, అన్యాయం చేస్తున్నవారి పేర్లను ఏ పుస్తకంలోనైనా రాసుకోవాలని, అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తామని చెప్పారు. తమకూ టైమ్ వస్తుందని తెలిపారు. చంద్రబాబు తీరు వల్ల పరిస్థితులు వచ్చాయని, మహిళలు అని కూడా చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారని చెప్పారు.ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారని జగన్ తెలిపారు. వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారని చెప్పారు. నందిగం సురేశ్ విషయంలో కూడా ఇలాగే దారుణాలు చేస్తున్నారని అన్నారు. సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారని చెప్పారు.



