దివాలా అయ్యింది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కాదు.. రేవంత్ రెడ్డి ఆలోచనలు..
మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు
It is not the Telangana economy that has gone bankrupt.. Revanth Reddy's thoughts.. Former Minister Harish Rao's satires
హైదరాబాద్ మే 21
;తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. 2015లో తలసరి జీఎస్వీఏ (పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించిందని తెలిపారు. తలసరి ఆదాయం ₹1.25 లక్షల నుంచి ₹3.5 లక్షలకు రెట్టింపు కాగా, 6.8% సీఏజీఆర్తో ఈ పురోగతి సాధ్యమైందని అన్నారు.ఈ విజయం వెనుక కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాలు, బలమైన పారిశ్రామిక వృద్ధి ఉన్నాయని హరీశ్రావు తెలిపారు. ఇది సమర్థవంతమైన పాలన, ధీటైన ఆర్థిక వ్యూహాలతో తెలంగాణను దేశంలో అభివృద్ధి చిహ్నంగా నిలిపిన సాక్ష్యమని అన్నారు.. అయినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని “దివాలా” రాష్ట్రంగా చిత్రీకరిస్తూ వస్తున్నారని మండిపడ్డారు. వాస్తవంగా దివాలా అయింది ఆర్థిక వ్యవస్థ కాదు, ఆయన ఆలోచనలే అని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ నిరూపిత విజయాలను విస్మరించి, బీఆర్ఎస్ వేసిన బలమైన పునాదిని కొనసాగించకపోవడం అంటే ప్రజలను తప్పుదారి పట్టించడమే కాదు, తెలంగాణ ప్రగతిని అవమానించడమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలన సాధించిన ఈ ఆర్థిక విజయం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.



