కోటి ఆధార్ కార్డులు రద్దు
హైదరాబాద్, జూలై 17, (వాయిస్ టుడే)
One crore Aadhaar cards cancelled
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( యూఐడీఏఐ ) ఇటీవల మైఆధఆర్ పోర్టల్లో కుటుంబ సభ్యుల మరణాలను నివేదించే కొంత సేవలను ప్రారంభించింది. తద్వారా ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వం, సమగ్రతను కాపాడవచ్చని తెలిపింది. మరణించిన వారి ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 1.55 కోట్ల మరణ రికార్డులు నమోదయ్యాయని, అందులో 1.17 కోట్ల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు తెలిపింది.ఈ ప్రక్రియను మరింత విస్తృతం చేసేందుకు బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి కూడా మరణ రికార్డులను సేకరించే ఆలోచన ఉందని యూఐడీఏఐ తెలిపింది.భారతీయ పౌరులకు విశిష్ట గుర్తింపు సంఖ్యలను జారీ చేసే చట్టబద్ధమైన సంస్థ యూఐడీఏఐ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. యూఐడీఏఐ ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ని ఆధార్ నంబర్లతో అనుసంధానిన మరణ రికార్డులను పంచుకోవాలని అభ్యర్థించింది. ఈ మేరకు జులై 16వ తేదీన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పలు విషయాలు వెల్లడించింది. దాని ప్రకారం, ఆర్జీఐ ఇప్పటి వరకు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ని ఉపయోగించి 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి దాదాపు 1.55 కోట్ల మరణ రికార్డులను అందించింది. వాటికి సంబంధించి తగిన ధ్రువీకరణ తర్వాత సుమారు 1.17 కోట్ల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేశారు. అనుసంధానం లేని ప్రాంతాలతోనూ ఇదే విధమైన ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటి వరకు సుమారు 6.7 లక్షల మరణ రికార్డులు అందినట్లు యూఐడీఏఐ తెలిపింది. వాటి ఆధారంగానే ఆధార్ కార్డుల డీయాక్టివేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది.జూన్ 9వ తేదీన ఆన్లైన్ డెత్ రిపోర్టింగ్ సేవలు (కొత్త మరణ నివేదన సేవ)పై యూఐడీఏఐ కీలక విషయాలు వెల్లడించింది. పోర్టల్లో అందుబాటులోకి వచ్చిన కొత్త సదుపాయం ద్వారా కుటుంబ సభ్యుని మరణం నివేదించవచ్చు. కుటుంబ సభ్యుడు మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఇతర జనాభా వివరాలను పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు సమర్పించిన సమాచారం ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్ను డీయాక్టివేట్ చేయడం లేదా ఇతర చర్యలు తీసుకుంటారు.పైలట్ ప్రాజెక్టుగా.. 100 సంవత్సరాల పైబడిన ఆధార్ నంబర్ హోల్డర్ల జనాభా వివరాలు ఆధార్ నంబర్ హోల్డర్ ఇంకా సజీవంగా ఉన్నారా అని ధ్రువీకరించడానికి రాష్ట్రాలకు అందిస్తున్నట్లు యూఐడీఏఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అటువంటి ధ్రువీకరణ నివేదిక స్వీకరించిన తర్వాత, అటువంటి ఆధార్ నంబర్ను డీయాక్టివేట్ చేయడానికి ముందు అవసరమైన ధ్రువీకరణ జరుగుతుంది అని తెలిపింది.


