సుధాకరరెడ్డి కన్నుమూత
హైదరాబాద్, ఆగస్టు 23
Sudhakara Reddy passes away
కమ్యూనిస్ట్ యోధుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… శుక్రవారం హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. కమ్యూనిస్టూ పార్టీ తరపున తను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1998, 2004లో లోక్ సభ సభ్యునిగా సేవలు అందించారు. అలాగే సీపీఐ ప్రధాన కార్యదర్శిగాను పని చేశారు. మహబూబ్నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942లో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలపై ఆసక్తితో.. సీపీఐలోకి ప్రవేశించారు. ఈయన తండ్రి వెంకట్రామిరెడ్డి..స్వాతంత్ర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్రెడ్డి కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పట్టాపొందారు. 1974లో విజయలక్ష్మిని వివాహం చేసున్నారు. వారికి ఇద్దరు కుమారులు.రెండు సార్లు నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికై ప్రజా సేవ చేశారు. 2012లో సీపీఐ జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, విశేష సేవలు అందించారు. సుదీర్ఘ కాలం పాటు సీపీఐలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి, ఆ పదవికే వన్నె తెచ్చారు. ఈ పదవిలో ఉన్నంతకాలం పార్టీ బలోపేతానికి కృషి చేశారు. రైతాంగం, కార్మిక సంఘాల పోరాటాల్లో ముందు వరుసలో నడిచి, సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృష్టి చేశారు. వామపక్ష శక్తుల ఏకీకరణ కోసం కూడా ఆయన పరితపించారు. సామాజిక సమస్యలపై లోతైన ఆలోచన కలిగిన మేధావి అని విమర్శకులు ప్రశంసిస్తారు. ప్రజల పక్షాన నిలిచి, గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల మెరుగుదలకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి మాత్రమే కాదు, దేశ రాజకీయాలకు కూడా అపూర్వ నష్టం అని సహచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీలు పెద్ద దిక్కును కోల్పోయాయని పలువురు అభివర్ణిస్తున్నారు. 1998-99 సంవత్సరాల్లో సురవరం సుధాకర్ రెడ్డి మానవ వనరుల అభివృద్ధి కమిటీ కింద పనిచేసే ఔషధ ధర నియంత్రణ ఉప కమిటీలో సభ్యునిగా విశేష సేవలు అందించారు. అదే సమయంలో ఆయన ప్రభుత్వానికి చెందిన అనేక సలహా బృందాలలో కూడా తనవంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటైన సలహా కార్యవర్గంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇలా తనకు తోచిన రీతిలో పలు సేవలు అందించి, రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన యాక్టివ్ గా లేరు.
మంచి మిత్రుడ్ని కోల్పయా
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు వేరైనా సురవరం తనకు అత్యంత ఆత్మీయ మిత్రుడని, ఆయనను కోల్పోవడం వ్యక్తిగతంగా తీరని లోటని ఆవేదన చెందారు. సురవరం భౌతికకాయానికి దత్తాత్రేయ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సురవరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరారు. తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి తుదిశ్వాస విడిచే వరకు పోరాటం సాగించారు. నల్గొండ ఎంపీగా పార్లమెంటులో ప్రజా సమస్యలపై ఆయన గళం వినిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని కొనియాడారు. సురవరం లోతైన పరిజ్ఞానం, నీతి, నిజాయతీ కలిగిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.రాజకీయంగా భిన్న ధ్రువాలైనా తమ మధ్య ఎంతో స్నేహపూర్వక వాతావరణం ఉండేదని దత్తాత్రేయ తెలిపారు. “ఆయన విమర్శలు ఎంతో సున్నితంగా, హుందాగా ఉండేవి. ఎన్నో అంశాలపై నాతో చర్చించి, పరిష్కార మార్గాలు కూడా సూచించేవారు. నేను ఆహ్వానించిన ప్రతిసారీ ‘అలై బలై’ కార్యక్రమానికి హాజరయ్యేవారు. అలాంటి మంచి స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది” అని భావోద్వేగానికి గురయ్యారు. సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.



