ముద్రగడ దారెటు..
కాకినాడ, ఫిబ్రవరి 2, (వాయిస్ టుడే )
Mudragada WAY..
కాపు నాయకుడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. కాపు సామాజిక వర్గం నుంచి ఎంతోమంది రాజకీయంగా ఎదిగినా, రిజర్వేషన్ ఉద్యమం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ ఒకే దిశలో సాగలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉద్యమ నాయకుడిగా ప్రజల్లో ఆదరణ పొందినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అదే సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఆయన వైఖరి కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంటారు.ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో ఆయన ఇచ్చిన పిలుపును కాపు వర్గం పెద్దగా పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా జనసేన పార్టీ పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఎన్నికల ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పోరాడతానని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆ సమయంలోనే ఆయన అనారోగ్యానికి గురికావడంతో రాజకీయంగా చురుగ్గా ముందుకు సాగలేకపోయారు.ముద్రగడ రాజకీయ జీవితం ప్రారంభ దశలో ఎంపీగా, మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఆయనను తీవ్రంగా కలచివేసిందని చెబుతారు. ఆ ఓటమి తరువాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజకీయంగా సరైనవి కాదన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం వయసు పెరిగిపోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటంతో తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. గౌరవం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని ఆయన సంకేతాలు పంపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మొదట పవన్ సానుకూలంగా స్పందించినా, ఆ తర్వాత పరిస్థితులు మారడంతో ముద్రగడ మనస్తాపానికి గురయ్యారని అంటారు. అదే సమయంలో ఆయన తాడేపల్లి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఆయనకు గౌరవం లభించినప్పటికీ, పార్టీ భవిష్యత్తుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం కొనసాగుతుండటం, వైసీపీ బలహీనంగా కనిపించడంతో 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి అవకాశాలు తక్కువేనన్న చర్చ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఆలోచన మారుతున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవల టీడీపీకి చెందిన సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప తో ఆయన భేటీ కావడం మరింత ఆసక్తిని రేపింది. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని చెప్పినా, దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కుమారుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ముద్రగడ కూటమి పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం బలపడుతోంది. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎదురైన నష్టాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంగా దీనిని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంతుందో, ఆయన తదుపరి అడుగు ఏమిటో కాలమే నిర్ణయించాల్సి ఉంది.



