కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 16
Appropriate action to recover funds due from the Central Government
కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో సి.ఎస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధులు మార్చి నెలాఖరులోగా సమీకరించుకునేందుకు ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎస్ఎన్ఎ నిధులు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్, ఇతర పథకాల క్రింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించి, దీనిపై ఢిల్లీలో ఒక ప్రత్యేక అధికారిని నియమించుకొని సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్య, వైద్యారోగ్య,గిరిజన సంక్షేమ శాఖల వారీగా కేంద్రం నుంచి సుమారు 15 వేల కోట్ల రూపాయిలు రావాల్సి ఉందని, వీటిని సమీకరించుకొని రాష్ట్రంలోని పెండింగ్ పనులకు ఖర్చు చేయాలని సూచించారు.
100 వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక :
గౌరవ ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2, 3 తేదీల నుండి జూన్2వ తేదీ వరకు వివిధ అభివృద్ధి పనులపై వివిధ డిపార్టుమెంట్ల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలలో ఈ ప్రణాకను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపల్ లోకల్ బాడీస్ ఎన్నికలు ముగిసినందున ఎన్నికైన వార్డుమెంబర్లు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సలర్స్, కార్పొరేటర్స్ తదితర ప్రజాప్రతినిధులకు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు బాధ్యతతో కూడిన విధులు నిర్వర్తించేందుకు ఈ వందరోజుల కార్యాచరణ ప్రణాళిక(100 డేస్ యాక్షన్ ప్లాన్) ఉపకరిస్తుందని సిఎస్ తెలిపారు. గ్రామాల్లో,పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోడ్ల మరమ్మతులు, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడి లేకుండాకు తగు చర్యలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. రానున్న కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను రేపటిలోగా సమర్పించాలని సిఎస్ సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, సి.వీ.ఆనంద్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, అహ్మద్ నదీమ్, ఎన్. శ్రీధర్, యోగితారాణా, కార్యదర్శులు క్రిస్టినా చొంగ్తు, టికె శ్రీదేవి, స్టీఫెన్ రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.



