శశికళ కొత్త పార్టీ…
చెన్నై, ఫిబ్రవరి 17, (వాయిస్ టుడే )
Sasikala’s new party…
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకేలో తిరిగి చేరేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను ఎడప్పాడి పళనిస్వామి వర్గం పూర్తిగా తిరస్కరించడంతో, ఆమె తన మద్దతుదారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24, 2026న రామనాథపురం సమీపంలో శశికళ తన కొత్త పార్టీ పేరు , జెండాను ఆవిష్కరించే అవకాశం ఉంది. 2021 ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఆమె, ఈసారి మాత్రం సుమారు 40 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వం ఎంజీఆర్ , జయలలిత ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, పార్టీని మళ్లీ గాడిలో పెట్టడమే తన ఉద్దేశమని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళకు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఇప్పటికీ సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి.ఆమె అనర్హత కాలం వచ్చే ఏడాది ప్రారంభంలో ముగుస్తుంది, కాబట్టి ఆమె ఈ ఏడాది ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశం లేదు. అయినప్పటికీ, పార్టీని నడిపించడం , తన మద్దతుదారులను బరిలోకి దింపడం ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆమె భావిస్తున్నారు. శశికళ కొత్త పార్టీ వల్ల ప్రధానంగా అన్నాడీఎంకే కే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో బలమైన పట్టున్న తేవర్ సామాజిక వర్గం ఓట్లు అన్నాడీఎంకే నుండి శశికళ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ పార్టీ ఎంట్రీతో తమిళ రాజకీయాలు వేడెక్కగా, ఇప్పుడు శశికళ రంగంలోకి రావడం వల్ల ఓట్లు మరింతగా చీలిపోనున్నాయి. ఇది పరోక్షంగా అధికార డీఎంకే కు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.శశికళ ప్రకటన అన్నాడీఎంకేలోని ఈపీఎస్ వర్గానికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే ఓ. పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ వంటి నేతలు విడిపోయి ఉన్న తరుణంలో, శశికళ సొంత కుంపటి పెట్టడం వల్ల పార్టీ సంస్థాగతంగా మరింత బలహీనపడవచ్చు. అవినీతిపరులను పార్టీలోకి చేర్చుకోము అని పళనిస్వామి గట్టిగా చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కేడర్ విడిపోవడం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో ఈసారి ద్విముఖ పోరాటం కాకుండా, డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, విజయ్-శశికళ వంటి చిన్న పార్టీల మధ్య బహుముఖ పోటీ సాగనుంది. శశికళ కేవలం 40 సీట్లలోనే ప్రభావం చూపినప్పటికీ, అన్నాడీఎంకే గెలుపోటములను శాసించే శక్తిగా మారే అవకాశం ఉంది. జయలలిత వారసురాలిగా ఆమెకు ఉన్న గుర్తింపు ప్రజల్లో ఎంతవరకు పనిచేస్తుందనేది 2026 అసెంబ్లీ ఎన్నికలే తేల్చాలి



