23 తర్వాత పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)
Notification of council elections after 23
తెలంగాణలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పరిషత్ ఎన్నికలపై పడింది. ఈ క్రమంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం తెలంగాణ సర్కార్ సమాయత్తం అవుతోంది. దీంతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి చర్చించేందుకు ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశం తర్వాత.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఒక క్లారిటీ రానుందని తెలుస్తోంది.రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి కావడంతో రేవంత్ రెడ్డి సర్కార్.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 23వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ భేటీలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై.. సీఎం, మంత్రులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కీలక చర్చలు జరపనున్నారు. అదే సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరిషత్ ఎన్నికల గడువు పూర్తి కావడం.. ఇటీవలె సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది.అదే సమయంలో త్వరలోనే జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు కూడ ముగియనుండటంతో ఆ ఎన్నికలపైనా కేబినెట్ భేటీలో చర్చలు జరపనున్నారు. ఇక ఇటీవలె జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించగా.. ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలి అనే దానిపై చర్చించనున్నారు.మరోవైపు.. ఈ మంత్రి వర్గ సమావేశానికి ముందే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సంఘటన చోటు చేసుకోనుంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఏఐసీసీ వేదికగా కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఢిల్లీకి వెళ్లనుంది.కేబినెట్ భేటీకి ముందు హస్తం పార్టీ అధిష్ఠానంతో జరగనున్న ఈ భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఆ తర్వాత జరిగే కేబినెట్ భేటీలో ఏం చర్చిస్తారు అనేది ఇప్పుడు తెలంగాణలో ఆసక్తిగా మారింది.



