ప్రైవేటు దవాఖానాలపై సర్కార్ నిఘా
వరంగల్, మార్చి 17, (వాయిస్ టుడే)
Government surveillance of private hospitals
తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద ప్రతి హాస్పిటల్ తప్పనిసరిగా
రిజిస్టర్ చేసుకోవాలి. సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం ద్వారా ఫేక్ డాక్టర్లు, అనధికారిక క్లినిక్లకు అడ్డుకట్ట వేస్తూ హాస్పిటల్ పూర్తి వివరాలను ప్రజలకు ఆన్లైన్లో
అందుబాటులో ఉంచనున్నారు.తెలంగాణలో నకిలీ వైద్యులు ఎక్కువైపోయారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 250 నకిలీ హాస్పిటల్స్ ఉన్నట్లు తేలింది. అర్హత లేకున్నా డాక్టర్లుగా చెలామణి అవుతూ..
కాసుల కోసం హాస్పిటల్స్ ఓపెన్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ వైద్యానికి చెక్ పెడుతూ..
ఆన్లైన్లోనే ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది. ప్రైవేటు హాస్పిటల్ నడపాలంటే తప్పనిసరిగా అవి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.ఇందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటి
వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం జిల్లా వైద్యాధికారి ఆఫీసుకు వెళ్లాలనే నిబంధన ఉంది. ఈ విధానం వల్ల పలు ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే అనధికారికంగా ఆసుపత్రులను
నడిపిస్తున్నారు. అటువంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఇటీవల పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న ఫిజియోథెరపీ కేంద్రాలు కూడా సీఈఏను పట్టించుకోవడంలేదని తెలిసింది. ఇక నుంచి ప్రతి
ఆసుపత్రి తప్పనిసరిగా సర్కారు వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ సీఈఏ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ను తీసుకొచ్చింది. సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో తాజాగా పైలట్ ప్రాజెక్టుగా
ప్రారంభించారు.ఆసుపత్రి రిజిస్ట్రేషన్ కోసం కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరణ పత్రం, బయోమెడికల్ వ్యర్థాల వివరాలు, ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు, పనిచేసే డాక్టర్లు, నర్సులు.. వారి అర్హత, అందిస్తున్న సేవలు..
వైద్య సేవల ధరలు, పడకల వివరాలన్నీ ఆన్లైన్లో ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేశాక జిల్లా వైద్యాధికారి పరిశీలించి కలెక్టర్కు ఆ వివరాలను ఆన్లైన్లో పంపిస్తారు. కలెక్టర్ పరిశీలించి అనుమతికి
అంగీకరిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.నల్గోండ, ప్రస్తుతం కొన్ని అలోపతి హాస్పిటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా హోమియో డాక్టర్లు కూడా పనిచేస్తున్నారు. ఆర్ఎంపీలు అర్హత లేకున్నా హాస్పిటల్స్
నడిపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ కావడం వల్ల ఇకపై ఇలాంటి వాటికి కూడా అడ్డుకట్ట పడుతుందని అధికారులు అంటున్నారు. త్వరలోనే ప్రజలు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించి సకల సమాచారం
ఆన్లైన్లోనే చూసేలా పోర్టల్ అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారు.



