హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్.. షరతులతో నౌకలను అనుమతి..
న్యూ డిల్లీ మార్చ్ 25
Iran Reopens Strait of Hormuz; Ships Allowed Under Certain Conditions.
హార్ముజ్ జలసంధి మూసివేతతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చేలా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అది పాక్షికంగానే. అందులోనూ నౌకల రవాణాకు అనేక షరతులు వర్తిస్తాయి. తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని మాత్రమే ఈ జలసంధి నుంచి అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ)కు ఇరాన్ ఒక లేఖ ద్వారా తెలిపింది.తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని, తమ దేశ రక్షణ, భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటే మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ఇరాన్కు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి కార్యకలాపాలతో సంబంధం ఉండకూడదు. ఇరాన్తో కలిసి సమన్వయం చేసుకుని నౌకల్ని రవాణా చేసుకోవాలి. ఇక ఇజ్రాయెల్, అమెరికాలకు చెందిన ఎలాంటి నౌకల్ని ఇరాన్ ఈ జలసంధి మార్గంలో అనుమతించదు. మరోవైపు ఇప్పటికే ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ పన్ను వసూలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ హార్ముజ్ జలసంధి మార్గంలో నౌకలు తక్కువ సంఖ్యలోనే కదులుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ఈ మార్గం ద్వారా సాగే రవాణా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైంది.ప్రపంచంలో ఐదోవంతు చమురు ఈ మార్గం నుంచే రవాణా అవుతుంది. చమురుతోపాటు ఆహారం, మెటల్స్, పారిశ్రామిక ఉత్పత్తులు వంటివెన్నో ఈ మార్గం ద్వారా వెళ్తుంటాయి. అలాంటి మార్గం ఇప్పుడు స్తంభించిపోవడంతో రవాణా ఆగిపోయింది. దీంతో అనేక దేశాలు చమురు కొరత ఎదుర్కొంటున్నాయి. ఆహారం సంక్షోభం మొదలైంది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే ఈ మార్గం త్వరగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలని అనేక దేశాలు కోరుకుంటున్నాయి



