తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
32 డిమాండ్ల కోసం 22 నుంచి సమ్మె
హైదరాబాద్, ఏప్రిల్ 17, ( వాయిస్ టుడే )
Strike Siren Sounds at Telangana RTC
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగుతుంది. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఏప్రిల్ 22 అర్థరాత్రి
నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. గత కొన్ని వారాలుగా ప్రభుత్వంతో, యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో, కార్మికులు, ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవు
ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో సెమ్మె ప్రకటన సామాన్య ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. టీజీఎస్ ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వ విభాగంగా విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల
ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ భద్రత లభిస్తుందని యూనియన్లు చెబుతున్నాయి. 2021 ,2025 వేతన సవరణలను తగిన ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలని మరో డిమాండ్ ఉంది.
కార్మికులు 30 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ కోరుతున్నారు. రాష్ట్రప్రభుత్వం అమల చేస్తున్న మహాలక్ష్మి వల్ల సంస్థకు వస్తున్న ఆదాయ లోటును భర్తీ చేసేందుకు ప్రతి నెల 350 కోట్లను
ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
దీని వల్ల సంస్థ ఉనికి దెబ్బతింటుందని, ప్రభుత్వమే నేరుగా ఈ బస్లను నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల కోసం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని జేఏసీ
డిమాండ్ చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై స్పందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయాలనే ప్రతిపాదన ఒక కమిటీ పరిశీలనలో ఉందన్నారు. కార్మికుల సమ్మెకు
వెళ్లవద్దని సూచించారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 2.1శాతం కరవు భత్యం పెంచినట్టు గుర్తు చేశారు.
2019 నుంచి పెండింగ్లో ఉన్న 10 డీఏలను విడతల వారీగా విడుదల చేశామన్నారు. 2017 పీఆర్సీని కూడా 21 శాతం ఫిట్మెంట్తో అమలు చేశామని వివరించారు. ఆర్టీసీ చరిత్రలో 2019
అక్టోబర్లో జరిగిన 52 రోజుల సుదీర్ఘ సమ్మెను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పటి ప్రభుత్వం సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. విధులకు హాజుకాని వారిని డిస్మిస్ చేస్తామని హెచ్చరించింది.
ఆనాడు సుమారు 50 మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమ్మె జరిగితే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడతారు. అప్పట్లో అదే జరిగిందని ప్రభుత్వం కఠినమైన
చర్యలు తీసుకుంది. ఇప్పుడు కూడా నిత్యం బస్లపై ఆధారపడే ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలకు సవాళ్లు తప్పవు. అందుకే ఉద్యోగులు సమ్మె వెళ్లకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు
చేస్తోంది.



