ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్..?
27న సంచలన నిర్ణయం?
KCR into the Public Arena? A Sensational Decision on the 27th?
హైదరాబాద్:
రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంతకాలం బయటకు రాని మాజీ సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్ ఒక్కసారిగా బయటకు వచ్చి అందరినీ షాక్కు గురిచేశారు. అంతటితో ఆగకుండా జగిత్యాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరై ఏకంగా గంటపాటు ప్రసంగించారు. గతంలో వరంగల్లో నిర్వహించిన సభలో కేవలం 10 నుంచి 20నిమిషాలలోపే ఆయన ప్రసంగం సాగింది. కానీ, ఈసారి కేసీఆర్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే బహిరంగ సభకు హాజరైనట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి రెండున్నరేండ్లు పూర్తయింది. ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఫాంహౌస్ నుంచే గమనిస్తున్న కేసీఆర్.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పార్టీలో చేరిక సందర్భంగా బయటకు రావడంతో పాటే కాంగ్రెస్ పార్టీకి బలమైన సంకేతం పంపారు.
వరుస బహిరంగ సభలు.
.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. జగిత్యాల సభతో వచ్చిన మైలేజీతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ప్రభుత్వానికి సమయం ఇచ్చామని.. ఇక ఊరుకునేది లేదని గులాబీ కేడర్ను ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై దృష్టి సారిస్తూ ఈనెల 27న మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ముఖ్య సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. అదే రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడం, రజతోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్నీ నిర్వహించనున్నారు. దీనికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కొత్త సభ్యత్వాలు.. పార్టీ బలోపేతం..
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. దీంతో 27న నిర్వహిస్తున్న భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తారని టాక్. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి? అనే విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా, మండల స్థాయిలోనూ పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, నాయకత్వాన్ని చురుకుగా మార్చడం వంటి అంశాలు ఎజెండాలో ఉండనున్నట్టు తెలుస్తున్నది.
కొత్త సభ్యులను ఆకర్షించడం, యువతను పార్టీలోకి తీసుకురావడం, గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరణ జరగాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తున్నది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సభల ద్వారా పార్టీ శక్తిని ప్రదర్శించడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ బహిరంగ సభలు పార్టీకి మళ్లీ ఉత్సాహాన్ని నింపే అవకాశమున్నదని నేతలు భావిస్తున్నారు.



