బండి – ఈటెల మధ్య సయోధ్య
రంగంలోకి దిగిన బీజేపీ దూత అభయ్ పాటిల్
హైదరాబాద్, జూలై 18 (వాయిస్ టుడే):
Reconciliation between the cart and the spear

తెలంగాణలో అధికార లక్ష్యంతో ముందుకెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని అంతర్గత విభేదాలను పరిష్కరించే దిశగా చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరియు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య కొనసాగుతున్న విభేదాలకు ముగింపు పలికేందుకు పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం తరఫున అభయ్ పాటిల్ హైదరాబాద్కు వచ్చి, ఇద్దరు నేతలతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ నివాసంలో జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీకి క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల్లో నాయకుల మధ్య సమన్వయం లోపిస్తున్నట్లు, ముఖ్యంగా సీనియర్ నేతల మధ్య విభేదాలు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతున్నట్లు అధిష్ఠానం గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా కీలక నేతల మధ్య సమన్వయం తీసుకురావాలని నిర్ణయించింది.
సమావేశంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ తమ అభిప్రాయాలు, సమస్యలను అభయ్ పాటిల్ ముందు ఉంచినట్లు సమాచారం. ఇరువురు నేతలు భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో సమన్వయంతో పనిచేయాలని, అధిష్ఠానం సూచనలను పాటించాలని అభయ్ పాటిల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం మీడియాతో మాట్లాడిన కే. లక్ష్మణ్, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వ్యూహాలపై చర్చించామని తెలిపారు. నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బీజేపీ ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలపైనా చర్చించినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో బండి సంజయ్, ఈటల రాజేందర్, కే. లక్ష్మణ్ కలిసి హాజరయ్యారు. అంతకుముందు ముగ్గురు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.




