తెలంగాణలోనూ మఖానా సాగు
హైదరాబాద్, ఆగస్టు 14
Makhana cultivation in Telangana too
వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం కోసం తెలంగాణ, బిహార్ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. తెలంగాణలో విజయవంతమైన ఆయిల్పామ్ సాగు విధానాన్ని అధ్యయనం చేయడానికి బిహార్ ఆసక్తి చూపగా.. బిహార్లో ప్రసిద్ధి చెందిన మఖానా సాగు, ప్రాసెసింగ్ విధానాలపై తెలంగాణ ఆసక్తి వ్యక్తం చేసింది. సెక్రటేరియట్లో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బిహార్ మంత్రి విజయ్కుమార్ సిన్హా భేటీ అయి.. ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిధ్యీకరణపై చర్చించారు. ఈ రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల మధ్య చోటుచేసుకున్న ఈ పరిణామం నూతన వ్యవసాయ సహకారానికి మార్గం సుగమం చేస్తోంది.ఈ మేరకు బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్కుమార్ సిన్హా హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతికత వినియోగం, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలు, కొత్త పంటల సాగు, ప్రాసెసింగ్ పరిశ్రమలు, మార్కెటింగ్ విధానాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో ఆయిల్పామ్ సాగు విస్తరణ, నర్సరీల అభివృద్ధి, పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుపై బిహార్ మంత్రి ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో 2025–26లో సుమారు 3.1 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు జరిగి 74 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నమూనాను పరిశీలించేందుకు బిహార్ నుంచి ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపనున్నారు.మరోవైపు బిహార్లో విస్తృతంగా సాగయ్యే మఖానా పంటపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ముడి ఉత్పత్తిగా కాకుండా ప్రాసెసింగ్, బ్రాండింగ్, విలువ జోడింపుతో మార్కెట్ చేయడంపై బిహార్ అనుభవాన్ని అధ్యయనం చేయాలని తెలంగాణ భావిస్తోంది. బిహార్లో పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాల కోసం ప్రత్యేక పంట క్లస్టర్లను అభివృద్ధి చేసిన విధానాన్ని ఆ రాష్ట్ర అధికారులు వివరించారు. ఈ పరస్పర సహకారం వల్ల రెండు రాష్ట్రాల రైతులకు కొత్త పంటలు, సాంకేతికతలు, ప్రాసెసింగ్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణకు మఖానా వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు మార్గం సుగమం కాగా.. బిహార్కు ఆయిల్పామ్ వంటి వాణిజ్య పంటను విస్తరించే అవకాశం లభిస్తుంది. ఇరు రాష్ట్రాల శాస్త్రవేత్తలు, రైతుల బృందాల పర్యటనల ద్వారా ఉత్తమ పద్ధతుల మార్పిడి మరింత వేగవంతం కానుంది.




