ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశం

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశం
 తెలంగాణలో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌
TCS delegation meets Chief Minister Revanth Reddy.
దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటం తెలంగాణను ప్రపంచ ఏఐ మ్యాప్‌లో మరింత ముందుకు తీసుకెళ్లే చరిత్రాత్మక పరిణామమని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అన్నారు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుతో హైదరాబాద్ గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా ఎదగడంతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు , మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్‌కుమార్  పాల్గొన్నారు. టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ , సీఓఓ ఆర్తి సుబ్రమణియన్ , హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న , హైపర్ వాల్ట్ సీఈఓ, ఎండీ దీపేష్ నందారు, అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు  పాల్గొన్నారు.
ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న నేపథ్యంలో, ఆ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని ముఖ్యమంత్రి  అన్నారు. తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు అని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అవుతుందని చెప్పారు.
హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో పర్యావరణ అనుకూలంగా క్యాంపస్‌ను తీర్చిదిద్దనున్నారు.
ఈ భారీ పెట్టుబడితో ఏఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది.
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టీసీఎస్, హైపర్ వాల్ట్ ప్రతినిధులను ముఖ్యమంత్రి  అభినందించారు. ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని ముఖ్యమంత్రి  అన్నారు. ఆశించిన విధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడిందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలకు 2026 జనవరిలో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్  మధ్య జరిగిన సమావేశం నాంది పలికింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి కొద్ది నెలల్లోనే ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చాయి. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించింది. హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు మరింత బలం చేకూర్చనుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు , ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్‌రెడ్డిరు, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక , పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య , డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి , ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular