కమలం పార్టీలో తుఫాను…
హైదరాబాద్, డిసెంబర్ 15
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి భారతీయ జనతా పార్టీలో సందడి లేదు. పెద్దగా పార్టీ నేతలు ఎవరూ స్పందించడం లేదు. ఫలితాల విషయంలో నిరాశగా ఉన్నారని అందుకే మాట్లాడటం లేదని అనుకోవచ్చు. నిజానికి బీజేపీకి అంత నిరాశజకనమైన ఫలితాలు రాలేదు. తెలంగాణలో ఎనిమిది సీట్లు వచ్చాయి. ఇవి మజ్లిస్ పార్టీ కంటే ఎక్కువ. గత ఎన్నికల్లో ఒక్కటే వచ్చింది. ఈ సారి ఏకంగా 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇవి మరీ తీసి పడేయాల్సిన ఎన్నికలు కావు. కానీ పార్టీ నేతల మధ్య మధ్య మాత్రం ఓ రకమైన ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది. బండి సంజయ , ఈటల రాజేందర్ , కిషన్ రెడ్డిల మధ్య ఏదో జరుగుతోందని బీజేపీ వర్గాలంటున్నాయి. ఈ అంతర్గత పోరాటం అంశం సోషల్ మీడియాకు ఎక్కుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన స్థాయి సీట్లను గెలుచుకోలేక పోయిన తెలంగాణ బీజేపీకి అంతర్గత సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. 2020లో తెలంగాణ బీజేపీ సారథిగా నియమితులైన బండి సంజయ్.. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకువచ్చారు. కానీ, ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల క్రితం ఆయన స్థానంలో కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. అయితే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ సారథిగా కొనసాగిఉంటే కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తెరపైకి తీసుకొచ్చింది. మరోవైపు బండి సంజయ్ అనుచరులకు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈటల రాజేందర్ అనుచరులు. తన అనుచరులంటూ టికెట్లు ఇప్పించుకున్న వారికి బండి సంజయ్ గెలిపించుకోలేకపోయారని విమర్శిస్తున్నారు. చివరకు తన పార్లమెంట్ పరిధిలోకూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని సోషల్ మీడియాలో ఈటల అనుచరులు ఫుల్ ఫైర్ అయ్యారు. ఇవి శృతి మించి పోతూండటంతో.. ఈటల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో తన పేరుతో..తన అనుచరుల పేరుతో పెడుతున్న పోస్టులన్నీ ఫేక్ అని ప్రకటించారు. ఈ సోషల్ మీడియా వార్ బండి, ఈటలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని సైతం వదలడం లేదు. పార్టీ ఓటమికి కారణం ఆయనేనని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయాల్సిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. బండి సంజయ్కు మళ్లీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానిపై పార్టీ కార్యకర్తలు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. మరోసారి బండిని పార్టీ అధిష్టానం మోసం చేస్తుందని.. అందుకే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకోకూడదని.. కావాలంటే చివరి రెండేళ్లు ఆ బాధ్యతను తీసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. కిషన్ రెడ్డి విషయంలో జరుగుతున్న ప్రచారం మరింత భిన్నంగా ఉంది. ఆయన పై వ్యతిరేకత వచ్చేలా.. జనసేన గురించి ఏదో అన్నారంటూ పోస్టులు పెట్టారు. దీంతో కిషన్ రెడ్డి తాను అలా అనలేదని .. ..తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాల్సి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి సీనియర్ నేతలంతా సైలెంట్ అయ్యారు. దీనికి కారణం తాము టిక్కెట్లు ఇప్పించుకున్న వారు ఓడిపోవడమే. కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గంలో బీజేపీని గెలిపింలేకపోయారు. గద్వాలలో పోటీ చేయకుండా వేరొకరికి టిక్కెట్ ఇప్పించిన డీకే అరుణ అభ్యర్థిని గెలుపు అంచుల వరకూ తీసుకు రాలేకపోయారు. తన కుమారుడికి మహబూబ్ నగర్ టిక్కెట్ ఇప్పించుకున్న జితేందర్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఇక బండి సంజయ్ స్వయంగా ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ మాట్లాకపోగా.. పార్టీలో అంతర్గత రచ్చ పెట్టుకునేందుకు సోషల్ మీడియా సైన్యాలు రంగంలోకి దిగడంతో బీజేపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్ియలో పడినట్లవుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో మూడు నెలల్లోనే ఉన్నాయి. ఈ సమయంలో బీజేపీ అగ్రనేతలు అసెంబ్లీ గురించి మర్చిపోయి పార్లమెంట్ ఎన్నికల గురించి ఆలోచించాల్సి ఉంది. గతంలో గెలిచిన సికింద్రాబాద్ స్థానంలో ఈ సారి బీజేపీ మూడో స్థానంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితిని మెరుగు పర్చుకోవాల్సింది పోయి.. ఇలా వర్గ పోరాటానికి దిగితే.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో… కొంత మంది సీనియర్లు ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది
కమలం పార్టీలో తుఫాను…
- Advertisement -
- Advertisement -