జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం – బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం
Abuse of power in Jubilee Hills elections – BRS MP Vaddiraju Ravichandra is angry
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెగదెంపులు సృష్టించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా విమర్శించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్కు చెందిన గుండాలు, రౌడీలు దౌర్జన్యాలకు దిగారని, ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.
“అధికార కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఎన్నికల సంఘం నుండి ఎటువంటి చర్యలు తీసుకోలేదు,” అని ఎంపీ రవిచంద్ర తెలిపారు.
డిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నికల సంఘానికి, అలాగే హైదరాబాద్లో సిఈవో సుదర్శన్ రెడ్డికి కేటీఆర్, హరీష్ రావు తదితరులు 20కి పైగా ఆధారాలతో ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యూసుఫ్గూడలోని ఫంక్షన్ హాళ్లల్లో దొంగ ఓటర్లు మోహరించి ఉన్నారనే సమాచారం తెలుసుకొని, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, తాను, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు అక్కడికి వెళ్తే కాంగ్రెస్ రౌడీ మూకలు దాడి చేశాయి అని వివరించారు.
పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా అధికార పార్టీ కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తుండగా, పోలీసులు వారిని అడ్డుకోకుండా వత్తాసు పలికారని ఎంపీ రవిచంద్ర ఆరోపించారు. పోలింగ్ స్టేషన్ పక్కనే కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఫిర్యాదు చేసినా కూడా ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి చర్యలు లేవని ఆయన విమర్శించారు.
“రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది,” అని ఎంపీ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి, సిఈవో సుదర్శన్ రెడ్డి వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు కోరనున్నట్లు తెలిపారు.




