- Advertisement -
పర్యాటక రంగానికి ఊపు కోసం కసరత్తు
An exercise to boost the tourism sector
హైదరాబాద్, నవంబర్ 25, (వాయిస్ టుడే)
తెలంగాణలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మినహా.. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. అయితే.. హైదరాబాద్ వెలుపల ఉన్న పర్యాటక ప్రదేశాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 10 ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయనుంది. సరికొత్త అనుభూతిని పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. చరిత్రకు అద్దంపట్టే ప్రదేశాలకు లెక్కలేదు. ఆహ్లాదం, ఆనందాన్ని పంచే ప్రాంతాలకు కొదవ లేదు. కానీ.. ఆ ప్రాంతాలపై దృష్టిపెట్టక అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు పర్యాటకులు వచ్చినా.. సరైన సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానంగా 10 సర్క్యూట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. హైదరాబాద్ వెలుపల ఉండే పది ప్రత్యేక ప్రాంతాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించనుంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా పర్యాటక పాలసీని తయారుచేస్తున్నారు. ఇది తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈ ముసాయిదాపై త్వరలోనే సమావేశం నిర్వహించి మార్పుచేర్పులు చేయనున్నారు. ఆ తర్వాత కేబినెట్లో చర్చించి పర్యాటక విధానాన్ని ఖరారు చేయనుంది. గుర్తించిన ప్రదేశాల్లో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల్లోనూ ప్రాజెక్టులు చేపట్టేలా పాలసీ ఉంటుందని తెలుస్తోంది. పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. పెట్టుబడిని బట్టి రూ. 100 కోట్ల వరకు, రూ. 100-500 కోట్లు.. ఆ పైన ప్రాజెక్టులుగా వర్గీకరిస్తున్నట్లుగా టూరిజం అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. దీంతో ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా క్యారవాన్ వాహనాలు, సాహస క్రీడలపై పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారంభాగ్యనగరానికి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వెలుపల, మారుమూల ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. పర్యాటక ప్రాజెక్టులపై పెట్టే ఖర్చు, ప్రాంతాన్ని బట్టి గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు రాయితీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రైవేట్ పెట్టుబడులు పెరిగితే.. తెలంగాణ టూరిజం కొత్తపుంతలు తొక్కే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి కేవలం 180 కి.మీ దూరంలోని నాగర్కర్నూల్ జిల్లా సోమశిల నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు క్రూయిజ్ షిప్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏడాది పొడవునా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కసరత్తు చేస్తోంది. మరో వైపు కేరళలోని అలప్పుజ, జమ్మూకశ్మీర్ శ్రీనగర్లోని దాల్ లేక్లో మాదిరి స్పీడ్ బోట్లు, హౌస్బోట్ల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సైతం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం కృష్ణానదిలో సమృద్ధిగా నీరు ఉండటంతో సోమశిల నుంచి శ్రీశైలం వరకు.. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు క్రూయిజ్ షిప్ టూర్ని రెండ్రోజుల క్రితం ప్రారంభించారు. సోమశిల- శ్రీశైలం 120 కి.మీ. దూరం కాగా 6.30 గంటల్లో నది అందాలను చూస్తూ జర్నీ చేయవచ్చు.ఈ లాంచీ ప్రయాణంలో అబ్బురపరిచే దృశ్యాలెన్నో పర్యాటకులను కనువిందు చేస్తాయి. నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీప్రాంత అందాలను వీక్షించొచ్చు. నదికి ఓ వైపు తెలంగాణలో అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యం ఉండగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఉంది. ఈ అడవుల్లో ఉండే పెద్దపులులు ఈదుతూ కృష్ణా నదిని దాటతాయి. నీటి మట్టం అధికంగా ఉన్నప్పుడు తప్పితే మిగతా సమయాల్లో పెద్దపులులు నది మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.త్వరలో హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో సోమశిల, నాగార్జునసాగర్ టూర్లను అధికారులు ఫ్లా్న్ చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీశైలం నుంచి తీసుకురావడంతో పాటు అక్కడ బోర్డింగ్ వంటి సౌకర్యాల్ని కల్పించనున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు నలుగురు ప్రయాణించేలా స్పీడ్ బోట్ల కొనుగోలుకు టూరిజం డిపార్ట్మెంట్ రెడీ అవుతోంది. 20 సీట్లతో డీలక్స్ బోట్ను కొనుగోలు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే. బోటు ప్రయాణాన్ని పర్యాటకురాలు ఆస్వాదించొచ్చు.ఇక నవంబర్ 2న ప్రారంభమైన క్రూయిజ్ షిప్ల ప్రత్యేక ప్యాకేజీ విషయానికొస్తే.. సింగిల్ వే పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. రౌండప్ టూర్ ప్యాకేజీ అయితే.. పెద్దలకు రూ. 3000, పిల్లలకు రూ. 2,400గా డిసైడ్ చేశారు. సోమశిల-శ్రీశైలం, నాగార్జున సాగర్- శ్రీశైలం ఈ రెండు టూర్లకు ఇదే ప్యాకేజీ వర్తించనుంది. ఈ ప్యాకేజీని https://tourism.telangana.gov. in/ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా 9848540371 లేదా 9848306435ను సంప్రదించొచ్చు.
- Advertisement -