హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుతో పాటు మరో 8 మందిపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. వ్యాపార వేత్త చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి వరల్డ్ బ్యాంకులో పనిచేసిన తాను.. 2011లో క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీసును ప్రారంభించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014లో ఏపీలో 165 హెల్త్కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ హెల్త్కేర్ సెంటర్లలో పలు రకాల సేవలందించామన్నారు. వీటితో పాటు ఖమ్మంలో టెలిమెడిసిన్, జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఉత్తరప్రదేశ్లో హెల్త్కేర్ సెంటర్ల ప్రాజెక్టు తమకు వచ్చిన సమయంలో పార్ట్టైమ్ డైరెక్టర్లుగా గోపాల్, రాజ్, నవీన్, రవిలను నియమించుకున్నామని.. బాలాజీ అనే వ్యక్తిని సీఈవో పెట్టామని తెలిపారు.
ఇదే క్రమంలో చంద్రశేఖర్ వేగే తమ కంపెనీల్లో షేర్లు కొని డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తాను అంగీకరించకపోవడంతో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లు, ఎస్ఐ మల్లికార్జున్ల సాయంతో కిడ్నాప్ చేయించి డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. చంద్రశేఖర్ చెప్పినట్టు వినాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.100 కోట్ల తన కంపెనీని అతని పేరుపై రాయించేకునే ప్రయత్నం చేశారని తెలిపారు. మీడియా, ఉన్నతాధికారులకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారన్నారు. సీఐ గట్టు మల్లు అతని బృందానికి రూ.10లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. వేణుమాధవ్ ఫిర్యాదు ఆధారంగా.. రాధాకిషన్రావుతో పాటు మరో 8 మందిపై 386, 365, 341, 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…….
మాజీ డీసీపీ రాధాకిషన్రావు పై మరో కేసు

- Advertisement -
- Advertisement -