- Advertisement -
కోటి సత్తెమ్మ తిరునాళ్ల కోసం ఏర్పాట్లు
Arrangements for Koti Sathemma Tirunalla
ఏలూరు, డిసెంబర్ 17, (వాయిస్ టుడే)
కోట సత్తెమ్మ.. కోరికలు తీర్చే కొంగు బంగారం.. వరాలిచ్చే చల్లని తల్లి. ఈ తల్లి దర్శనం ఎంతో అదృష్టం అని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఏపీ, తెలంగాణ తోపాటు.. ఇతర రాష్ట్రాల ప్రజలు అమ్మవారిని దర్శించుకొని ఆధ్యాత్మికానందం పొందుతుంటారు. కోట సత్తెమ్మ ఆలయం నిడదవోలు సమీపంలో ఉంది.శంఖచక్రాలనూ, గదనూ ధరించి.. అభయముద్రతో దర్శనమిస్తుంది కోట సత్తెమ్మ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో సత్తెమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడికి ఏపీ, తెలంగాణ తోపాటు ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు తరలివస్తారు. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తుంది. ఒకప్పుడు నిడదవోలును రుద్రమదేవి భర్త వీరభద్ర చాళుక్యుడు పాలించేవాడు. నిడదవోలును కోటగా ఏర్పరుచుకుని అనేక యుద్ధాలు చేసేవాడు. ఆ కోటలోనే అమ్మవారు స్వయంభువుగా వెలసిందని పెద్దలు చెబుతారు. కాలక్రమేణా కోట శిథిలమై, అమ్మవారి విగ్రహం మాయమైందట. ఆ తర్వాత తిమ్మరాజుపాలేనికి చెందిన ఓ భక్తుడి పొలంలో బయటపడింది. ఆ విగ్రహాన్ని ఆ పొలంలోనే ఉంచి పూజలు చేసేవారు. కొన్నాళ్లకు ఆ భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించగా.. తన పొలంలోని కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడటవిశాలమైన ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఈ ఆలయం ఉంటుంది. అమ్మవారిపైన భక్తితో స్థానికులు కోట సత్తెమ్మ, కోట సత్యనారాయణ, సత్యం… వంటి పేర్లు ఎక్కువగా పెట్టుకుంటారు. ఆలయానికి చుట్టుపక్కల ఉండే ముస్లింలు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. చీర, సారెను సమర్పించుకుంటారు. అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా.. శరన్నవరాత్రి ఉత్సవాలు, మార్గశిర మాసంలో ప్రత్యేకంగా తిరునాళ్లూ నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకోగానే భక్తులు వెంటనే వచ్చేయరు. సంతానంలేనివారు ఈ ప్రాంగణంలో ఉన్న సంతాన వృక్షాన్నీ పూజిస్తారు. ముడుపుకడతారు. పిల్లలు కలిగాక అమ్మవారి సన్నిధికి వచ్చి నామకరణం చేస్తారు. తులాభారంతో మొక్కులు తీర్చుకుంటారు. పెళ్లి కానివారు అమ్మవారిని పూజిస్తారు. పెళ్లయ్యాక మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులు.. రైల్లో నిడదవోలు రైల్వేస్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో సత్తెమ్మ ఆలయం ఉంటుంది. రోడ్డు మార్గంలో వచ్చే వారు రాజమండ్రి, తాడేపల్లి గూడెం మీదుగా చేరుకోవచ్చు.
- Advertisement -