Sunday, September 8, 2024

బీసీ సీఎంపై మళ్లీ బ్యాక్ స్టెప్పా…

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 10, (వాయిస్ టుడే ): తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ సీఎం వస్తారని అమిత్ షా ప్రకటించారు. ఆ తర్వాత బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనేందుకు ప్రధాని వచ్చారు. సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ప్రధాని మాత్రం  ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బీజేపీ నేతలు ఊసురుమన్నారు. బండి సంజయ్ ను తప్పించిన తర్వాత పార్టీలో వచ్చిన నీరసం.. సీఎం అభ్యర్థి ప్రకటనతో పోతుందని అనుకున్నారు. కానీ అలాంటి ప్రకటన చేయకపోవడంతో.. బీజేపీ ఎప్పట్లాకే కాళ్లిడ్చుకుంటూ ఎన్నికల పోరాటం చేయాల్సి వస్తోంది. తెలంగాణ బీజేపీ పోయిన చోటే వెదుక్కునే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోతోంది. బండి సంజయ్ ను తప్పించి చేసిన చారిత్రక తప్పిదంతో కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిన బీజేపీ నాయకత్వం తప్పు దిద్దుకునేందుకు పక్కా వ్యూహాలు పాటిస్తున్నా…  అమలులో మాత్రం బస్ మిస్సవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ లో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవసభలో ఆయన ప్రసంగం చూసినా అదే అర్థమవుతుంది.  బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని చాలా మంది ఊహించారు. అలా ప్రకటించినట్లయితే ఖచ్చితంగా బీసీ వర్గాల్లో కదలిక వస్తుందని. ..  బండి సంజయ్ ను తప్పించిన అంశం పక్కకుపోతుందని అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ సీఎం అభ్యర్థిపై బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని సీఎంను చేస్తామని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. అందుకు బీసీలంతా అత్మగౌరవ సభను ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సభకు వచ్చిన ఆయన  బీసీలకు చిరకాలం గుర్తుండిపోయే ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. అమిత్ షా చేసిన ప్రకటననే మోడీ మళ్లీ చేశారు. కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదు. ముఖ్యంగా సీఎం అభ్యర్థి విషయంలో మోడీపై పెట్టుకున్న అంచనాలన్నీ తప్పాయి. బీజేపీ హైకమాండ్  ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించాలనే ఆలోచన చేయదు. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు.    రాష్ట్రాల వారీగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో విజయం కోసం  పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.  అభ్యర్థిని కూడా ప్రకటిస్తే…  రూట్ మ్యాప్‌లో ఓ కీలకమైన అడుగు వేసినట్లు అవుతుందని అనుకున్నారు. తెలంగాణ బీజేపీలో బీసీల్లో బలమైన నేతలు ఉన్నారు.
ఆరెస్సెస్ నుంచి ఎదిగి.. రాష్ట్ర స్థాయిలో  కేసీఆర్ తో ఢీ కొట్టే స్థాయికి ఎదిగిన బండి సంజయ్, అలాగే కేసీఆర్ సహచరునిగా ఉండి ఆయననే సవాల్ చేస్తున్న ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీసీ నేతలు ఉన్నారు.  అందుకే.. వీరిలో ఒకర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే.. ఎంతో మేలు జరుగుతుందన్న అంచనాలు వచ్చాయి. తెలంగాణలో మున్నూరు కాపు సామాజికవర్గం  బీసీల్లో ప్రధానమైన వర్గం.  బండి సంజయ్ అదే వర్గానికి చెందిన వారు. కారణం ఏదైనా బీఆర్ఎస్‌కు ఆ వర్గం వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం ఉంది.  బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు సాధించడం వెనుక వారి మద్దతు ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. . ఇప్పుడు బండి సంజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆ వర్గం మొత్తం ఏకపక్షంగా మద్దతు పలుకుతారని అనుకున్నారు.  బండి సంజయ్  ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఇంకా ఎదగలేదని భావిస్తే ఈటల రాజేందర్ ఉండనే ఉన్నారు.  బీజేపీ బీసీ సీనియర్ నేతల్లో  ఈటల రాజేందర్ మరో కీలకమైన నేత. బండి సంజయ్ కన్నా సీనియర్ .   కేసీఆర్ తో పాటు నిన్నామొన్నటిదాకా నడిచి అప్పటి టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. అయితే తర్వాత పార్టీ నుంచి అవమానకరంగా బయటకు రావాల్సి వచ్చింది. బీజేపీ లో చేరి కీలక నేతగా ఎదిగారు. హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ వర్గానికి చెందినవారు. ఈ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ వర్గం కేసీఆర్ ఆగ్రహంతో  ఉంది. ఇప్పుడు ముదిరాజ్ వర్గానికి ప్రధాని మోదీ సీఎం అభ్యర్థిగా చాన్స్ ఇస్తే వారంతా ఏకపక్షంగా బీజేపీకి ఓట్లేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.   కానీ ఎవర్నీ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. తెలంగాణలో మా సీఎం అభ్యర్థి కేసీఆర్ మీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించే ధైర్యం ఉందా అని .. కేటీఆర్ తరచూ సవాల్ చేస్తూంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ  బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించి ఉంటే  .  బీఆర్ఎస్ సవాల్‌కు సమాధానం చెప్పినట్లవుతుంది. మా పార్టీలో బీసీని సీఎం చేయగలం.. మీ పార్టీలో చేయగలరా అని ప్రశ్నించే అవకాశం ఉండేది.  అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా కార్నర్ చేయవచ్చు. ఆ పార్టీ గెలిస్తే.. ఎవరు సీఎం అనే దానిపై పంచాయతీ నడుస్తుంది. ఎలా చూసినా బీసీ సీఎం అనేది కాంగ్రెస్‌లో  వర్కవుట్ కాదు.  అయితే రెడ్డి లేకపోతే దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. బీజేపీ కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే… అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల్నీ కార్నర్ చేసినట్లవుతుందన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది. చివరికి ఆ ప్లాన్ నూ బీజేపీ మిస్సయిందని రాజకీయవర్గాలు ఓ నిర్ణయానికి వచ్చేశాయి.

మాదిగ విశ్వరూప సభకు ప్రధాని

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మరోసారి హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటికే నవంబర్ 7న ఎల్ బి స్టేడియంలో బీజేపీ నిర్వహించిన సభ విజయవంతం అయింది. దీంతో మరోసారి ఈనెల 11న హైదరాబాద్ కు రానున్నారు.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బీజేపీ మరో బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు పీఎంవో అధికారులు.నవంబర్ 11న పరేడ్ గ్రౌండ్స్ లో ” మాదిగ విశ్వరూప సభ ” నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది.ఈ సభకు ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు కూడా రానున్నట్లు సమాచారం.ఇక ఇదే సభలో ప్రధాని ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.ఈనెల 11న సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.అనంతరం రోడ్ మార్గాన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు.మోడీ ఈ సభలో దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొంటారు. అనంతరం 6 గంటలకు అయన బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేస్తారు.అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకే వారంలో రెండు సార్లు హైదరబాద్ కు రావడం విశేషం. ఈ నెల 7వ తేదీన జరిగిన బీసీ సభలో పాల్గొన్న మోదీ… బీసీ అభ్యర్థిని సీఎం చేయటంపై ప్రకటన చేశారు. ఇక 11వ తేదీన జరిగే సభలో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం జన సమీకరణ పై దృష్టి సారించింది.కాగా ఎప్పటినుండో ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఎస్సీలకు నవంబర్ 11న శుభవార్త చెప్తారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ మోదీ తొలి పర్యటనకు ముందే ఎస్సీలు రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే.దీంతో ఈనెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ” మాదిగ విశ్వరూప సభ ” లో మోదీ ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్