22A బాధితులకు అండగా బీఆర్ఎస్
ఉచిత న్యాయ సహాయం కోసం తెలంగాణ భవన్లో లీగల్ సెల్
BRS stands by 22A victims.
హైదరాబాద్, ఆగస్టు 19 (వాయిస్ టుడే):
22A నిషేధిత భూముల జాబితాలో తమ ఆస్తులు చేరడంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. తెలంగాణ భవన్లో బాధితులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, 10 మంది న్యాయవాదులతో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.
22A పేరుతో ఎవరూ భయపడి దళారులకు 20–30 శాతం కమీషన్లు ఇవ్వొద్దని, ఆస్తులను తక్కువ ధరలకు విక్రయించవద్దని సూచించారు. ఎమ్మెల్యేలుగా అధికారులతో, కలెక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితుల వెంట ఉంటామని హామీ ఇచ్చారు.
హెచ్ఎండీఏ, హెచ్యూడీఏ అనుమతులు పొందిన లేఅవుట్లలోని పాత ఆస్తులను సైతం 22A జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చేసిన తప్పులను బాధితులే సరిచేసుకునే పరిస్థితి రాకుండా, 22A జాబితాలో చేర్చిన ప్రైవేటు భూములను ప్రభుత్వం సుమోటోగా పరిశీలించి ఆంక్షలను తొలగించాలని కోరారు. భూభారతి వ్యవహారంలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అవసరమైతే సీఎం నివాసం ముట్టడికి సిద్ధమవుతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములను పునరుద్ధరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




