
హైదరాబాద్: ఈ నెల 25 వ తేదీన నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సభకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్య అతిధిగా హాజరవుతారని మంత్రి. అదేవిధంగా ఈ నెల 17 వ తేదీ నుండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్ని నియోజకవర్గాలలో రోడ్ షో నిర్వహిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి గా ఉండటం వలన గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని వివరించారు. మినీ ఇండియా గా పిలుచుకొనే హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేసిందని వివరించారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పట్టం కడతారని, తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాదిస్తామని తెలిపారు. గ్రేటర్ లో అన్ని స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టో లో చెప్పిన కార్యక్రమాలే కాకుండా చెప్పనివి కూడా చేసిన ఘనత తమకే దక్కుతుందని అన్నారు. సొంత ఇల్లు లేని పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. GHMC పరిధిలో ఇప్పటి వరకు లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టి 70 వేల ఇండ్లను అర్హులకు ఇచ్చామని, మరో ౩౦ వేల ఇండ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. SNDP కార్యక్రం ద్వారా నాలాల ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేశామని వివరించారు. అదేవిధంగా రోడ్ల అభివృద్ధి, అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మరో లక్ష ఇండ్లను నిర్మిస్తామని మేనిఫెస్టో లో ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లో బిసి డిక్లరేషన్, గ్యారెంటీ లు అంటూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నాయకులు ప్రకటిస్తున్నారని, అవి అమలు కాకుంటే ప్రజలు ఎవరిని అడగాలని అన్నారు.