మున్నూరుకాపులకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్
ఒక వారంలో కార్పొరేషన్ జీవో!
Congress gives green signal to Munnur Kapu… Corporation will be operational in a week!


మున్నూరుకాపు నాయకులతో సీఎం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ కీలక భేటీ
హైదరాబాద్ :
తెలంగాణలో మున్నూరుకాపు సమాజ అభివృద్ధి దిశగా చారిత్రక ముందడుగు పడింది. కాంగ్రెస్ పార్టీతో తరతరాలుగా అనుబంధం కలిగి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న మున్నూరుకాపు నాయకుల బృందం శాసనసభలో సీఎం ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్లను కలిసి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపింది.
ఈ భేటీలో మున్నూరుకాపు సమాజానికి సంబంధించి ప్రధాన డిమాండ్లను నాయకులు స్పష్టంగా వారి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా
-
మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు,
-
సమాజ నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలు,
-
విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు,
-
కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల భూమి ప్రస్తుత స్థితిగతులు
వంటి అంశాలపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిగాయి.
సమావేశంలో వేమ్ నరేందర్ రెడ్డి, ఆది శ్రీనివాస్లు సానుకూలంగా స్పందిస్తూ, మున్నూరుకాపు సమాజానికి న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఒక వారంలోగా జీవో జారీ చేసేలా అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
స్వత్రంత్రం పోరాటం నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న మున్నూరుకాపు సమాజానికి తగిన గుర్తింపు కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నాయకులు అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే బడుగు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మున్నూరుకాపుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషమని పేర్కొన్నారు.
మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుతో విద్యార్థులకు స్కాలర్షిప్లు, యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి రుణాలు, సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన దిశ లభిస్తుందని తెలిపారు. అలాగే కోకాపేటలో కేటాయించిన భూమిపై స్పష్టత రావడం ద్వారా సమాజానికి శాశ్వత ఆస్తి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే కేంద్రం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశం మున్నూరుకాపు సమాజం–కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచిందని, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఈ భేటీ మరోసారి నిరూపించిందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్, గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్,ఈవి శ్రీనివాస్ రావు,మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్,కోట్ల ఆనంద్, వాసు, శ్రీధర్తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


