అవినీతి అనకొండే…
హైదరాబాద్, జూలై 23, ( వాయిస్ టుడే )
Corruption is an anaconda…
హైదరాబాద్లో ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణపై ఏసీబీ దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులను భారీగా గుర్తించింది. 9 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో కిలోల కొద్దీ బంగారం.. భారీగా డబ్బు,
విలువైన ఆస్తులు, కార్లు, కమర్షియల్ భవనాలు, అపార్ట్మెంట్లకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. గతంలో లంచం కేసులోనూ అరెస్టైన వెంకటరమణను ఈసారి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేశారు.
ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దాడులు
కొనసాగుతున్నాయి. దీంతో లంచాలు తీసుకుని అక్రమాస్తులు కూడబెట్టిన అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లోని మాదాపూర్లో ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ (డీఈ)
ముత్యం వెంకటరమణ.. ఏసీబీ అధికారులకు చిక్కారు. భారీగా అక్రమాస్తులు గుర్తించడంతో.. ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన
మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో వెంకటరమణను
అధికారులు అరెస్ట్ చేశారు.ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముత్యం వెంకటరమణ ఆదాయానికి మించి రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ విలువ లెక్కించగా.. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ రూ. వందల కోట్లలో ఉండే అవకాశముందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.ఈ ఏసీబీ అధికారుల సోదాల్లో 2
కిలోలకు పైగా బంగారు ఆభరణాలతోపాటు.. రూ.52 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు.. వజ్రాభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, విదేశీ మద్యం సీసాలు సీజ్ చేశారు. కియా,
మహీంద్రా, బలెనో కంపెనీలకు చెందిన 3 కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అంతేకాకుండా శేరిలింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో నివాస ఫ్లాట్లు, కమర్షియల్ భవనాలు, గుట్టల బేగంపేట్లో జీ+5
భవనం, మూసాపేట్లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న 10 అపార్ట్మెంట్లతో పాటు ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరుతో నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు
గుర్తించారు.ప్రస్తుతం రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో)లో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ.. గతంలో కూడా 2019లో లంచం కేసులో ఏసీబీకి చిక్కిన విషయం
వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయనపై నిఘా కొనసాగించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, బ్యాంకు ట్రాన్సాక్షన్లు, స్థిరాస్తుల రికార్డులను పరిశీలిస్తూ.. ముత్యం
వెంకటరమణ అక్రమాస్తుల కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.




