హైదరాబాద్: హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు పాల్గోన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన జరిగినందున డిసెంబర్ 9 (ఈరోజు) చాలా చారిత్రాత్మకమైన రోజు. యూపీఏ ప్రభుత్వం ఈ రోజునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ప్రజలు సంతృప్తిగా జీవించడానికి దశాబ్ద కాలం ఎదురు చూడాల్సి వచ్చిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోసం అద్భుతమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి ప్రభుత్వ ఏర్పాటును కానుకగా ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అంకితం గాంధీభవన్ సాక్షిగా కాంగ్రెస్ సిద్ధాంతాలు, ప్రజల ఆశయాలు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూ.చ తప్పకుండా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే పనిచేస్తుంది.
ప్రజల సంపదను ప్రజలకు పంచడానికి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. రాష్ట్ర మహిళలందరికీ ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలని అన్నారు



