- Advertisement -
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ తన అసలు రంగు బయటపెట్టింది..
Congress party revealed its true colors on LRS..
మాజీ మంత్రి, హరీశ్రావు ఆగ్రహం
హైదరాబాద్ జనవరి 8
ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి ఇది మరో నిదర్శనమని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టిందని విమర్శించారు.“డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తా”మని గతంలో కాంగ్రెస్ నేతలు మాటలు చెప్పారని హరీశ్రావు గుర్తుచేశారు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడం అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనే కదా అర్థమని హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన వల్ల రియల్ ఎస్టేట్ కుదేలైందని మేం ముందు నుంచే చెప్తుంటే బుకాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయండని సూచించారు.
- Advertisement -