సీపీడబ్ల్యు స్కీమ్..అగ్నిమాపక కేంద్రాన్ని పునరుద్ధరించండి
రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కి
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వినతి
సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
జగిత్యాల
నియోజక వర్గంలోని బీర్ పూర్, రాయికల్ సీ పీ డ బ్ల్యు స్కీమ్ లు పునరుద్ధరించడం తో పాటు రాయికల్ మండల కేంద్రంలో అగ్ని మాపక కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు రూ.5 కోట్లు నిధులు మంజూరు చేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 2004-2009 మధ్యకాలంలో జగిత్యాల రాయికల్ బీర్పూర్ ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతానికి శుద్ధి చేసిన నీరు సరఫరా చేసేందుకు సిపిడబ్ల్యూ స్కీం ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ తో ఇంటింటికి తాగునీరు అందిస్తామని అప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధిచేసిన నీరు సరఫరా చేసే సిపిడబ్ల్యూ స్కీం లను మూసివేశారన్నారు.
ఇటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు సరఫరా చేయకపోవడంతో, అటు సిపిడబ్ల్యు స్కీమ్ మూసివేయడంతో ప్రజలు తాగునీటి కోసం డబ్బా నీళ్లు కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దశాబ్ద కాలంగా సిపి డబ్ల్యూ స్కీం నిలిచిపోవడంతో యంత్ర సామాగ్రి ఫిల్టర్ బెడ్లు అన్ని మూలనపడ్డాయన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందించేందుకు మూసివేయబడిన సిపిడబ్ల్యూ స్కీములు పునరుద్ధరనకు జగిత్యాల మండలం 150 లక్షలు రాయికల్ మండలం 150 లక్షలు బీర్పూర్ మండలం 190 లక్షలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనాలు రూపొందించామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి వివరించారు. గతంలో రాయికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రంతో రాయికల్ బీర్పూర్ సారంగాపూర్ మల్లాపూర్ తదితర మండలాల్లో అగ్నిమాపక ప్రమాదాలను నియంత్రించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. రాయికల్ అగ్ని మాపక కేంద్రాన్ని నిలిపి వేయడం తో జగిత్యాల అగ్నిమాపక కేంద్రానికి 40 – 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించబడిన గ్రామాల్లో ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు జగిత్యాల అగ్నిమాపక కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.రాయికల్ మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కావలసిన అన్ని సదుపాయాలు ఉండడంతో పాటు స్థానికులు కూడా సహకరిస్తారని, రాబోయే వేసవిలో అగ్ని ప్రమాదాల నుండి నివారణకు తక్షణమే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో సిపిడబ్ల్యూ స్కీం పునరుద్ధరించేందుకు ఐదు కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు రాయికల్ లో అగ్ని మాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరగా, సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి నిధుల విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు