Sunday, September 8, 2024

గులాబీ దళంలో అసంతృప్తులు

- Advertisement -

గులాబీ దళంలో అసంతృప్తులు

హైదరాబాద్, మే 8,

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. తెలంగాణలో అన్ని పార్టీలలో విజయ గర్వం తొణికిసలాడుతోంది. అయితే, ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో బీఆర్ఎస్‌లో ఆ జోష్ తగ్గిందనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికలలో అక్కరకు వచ్చిన కుల సంఘాల లీడర్లు, బస్తీ లీడర్లు బీఆర్ఎస్‌ను పట్టించుకోవడం లేదు. క్యాడర్ కూడా నిరుత్సాహంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని, కేంద్రంలో చక్రం తిప్పేది తామేనంటూ చెబుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యంగా ఉన్నా లోలోపల ఆ పార్టీ నేతలకు భయం పట్టుకుందని, జనాన్ని సమీకరించడం తలకు మించిన భారంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.లోక్‌ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ప్రతి పార్లమెంట్ పరిధిలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు నేతలు. అయినప్పటికీ క్యాడర్ నుంచి ఆశించిన మేరకు పోటీ చేసే అభ్యర్థికి సపోర్టు రావడం లేదని సమాచారం. భువనగిరి, నాగర్‌ కర్నూల్, జహీరాబాద్ ఇలా మరికొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో క్యాడర్ కలిసి రావడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓడిన అభ్యర్థులకే ఆయా నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగించడంతో క్యాడర్‌తో పాటు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ ఎంపీ సెగ్మెంట్‌ ప్రచారంలో భాగంగా మన్నెవారిపల్లె వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికలకు ముందు ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పలు నియోజకవర్గాల్లో కొనసాగుతున్నట్టు సమాచారం.పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి బీఆర్ఎస్ దాదాపుగా 40 రోజులు దాటింది. అన్ని వర్గాలతోనూ భేటీ అవుతున్నారు. సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గెలుపుపై అభ్యర్థులు కొంత అనుమానమే వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ పూర్తిస్థాయిలో కలిసి రావడం లేదని పార్టీ అభ్యర్థులే అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధిష్ఠానం కిందిస్థాయి నేతలను గుర్తించకపోవడం, పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడం, కమిటీలు సైతం ఏర్పాటు చేయకపోవడం, గ్రూపులపై ఫోకస్ పెట్టలేదన్న విమర్శలున్నాయి. దాని వల్ల క్యాడర్, సెకండ్ స్థాయి నేతలూ అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ ఎంపీ అభ్యర్థులు మాజీ ప్రజాప్రతినిధులపై ఆధారపడ్డారు. వారిపై ఇప్పటికే వ్యతిరేకత ఉండటంతో క్యాడర్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని సమాచారం. దీంతో ఎంపీ అభ్యర్థుల గెలుపుపై వారి ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉందని రాజకీయ విమర్శకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్‌కు ఒకప్పుడు బలమైన నేతలు ఉండేవారు. పార్టీ అధినేత ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ కూడా ఉంది. కేసీఆర్‌ను ఈ క్యాడరే రెండు సార్లు అధికారంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు వారే లోక్‌సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా పరిస్థితి మారింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా నియోజకవర్గ స్థాయి నేతలు, బల్దియా కార్పొరేటర్లు, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ముందుకు కదలడం లేదట. కొంతమంది ఎమ్మెల్యేలు తూతూమంత్రంగా పని చేస్తున్నారని టాక్. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యం నెరవేరడం కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్