ఎండుతున్న పంటలు..మండుతున్న గుండెలు.
పశువులకు మేతగా పొట్ట కొచ్చిన వరి.
మెట్ట ప్రాంతంలో అడుగంటిన భూగర్భ జలాలు.
నీరందక నెర్రెలు వారుతున్న పొలాలు.
బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరం.
తిరుమలాయపాలెం,వాయిస్ టుడే, ఏప్రిల్ 18:
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇంకా మే నెల రాక ముందే ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. మెట్ట ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం పరిధిలోని గ్రామాలలో పిండిప్రోలు, దమ్మాయిగూడెం, బచ్చోడు, కాకరవాయి గ్రామాలలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి.
ఎక్కువ శాతం బోరుబావుల కింద పంటలను సాగు చేయగా, ప్రభుత్వం సరిగ్గా నీరందించలేకపోవడంతో వరి చేలు ఎండుముఖం పడుతున్నాయి. ఆరుగాలం శ్రమంతా వృథా అవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతు ఆశలపై దెబ్బ.
మొదటగా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోవడంతో రైతులు యాసంగిపై ఆశలు పెంచుకున్నారు. వరి సాగు వైపు మొగ్గు చూపారు. అయితే మార్చి,ఏప్రిల్ నెలలలోనే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటిపోతున్నాయి. బోర్లు నీరు ఇంకిపోతున్నది. దీంతో వరికి సరిపడా నీరందించలేక రైతులు అల్లాడుతున్నారు. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు వ్యవసాయ బావుల్లో పూడికతీతను చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక పొట్ట దశలో నెర్రెలువారిన చేనులో పశువులను మేపుతున్నారు.
పొట్ట దశలో పొలాన్ని ఎడ్లతో మేపుతున్న రైతు..పరికపల్లి వెంకటేశ్వర్లు.
పిండిప్రోలు గ్రామానికి చెందిన పరికపల్లి వెంకటేశ్వర్లు బావుల్లో ఉన్న నీటిని చూసి రెండు ఎకరాలు కవులు తీసుకొని వరిని సాగు చేశాను. పొలం పొట్ట దశకు వచ్చింది బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి.30 రోజులైనా గడిస్తే పంట చేతికి వచ్చేది,గ్రామానికి చుట్టుపక్కల ఉన్న చెరువులో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేసేది ఏమీ లేక ఆ రైతు ఎడ్లను పొలాల్లో మేపుతున్నాడు.