డ్రైవింగ్ లైసెన్స్ ఇక ఈజీ కాదు…
హైదరాబాద్, ఏప్రిల్ 6, (వాయిస్ టుడే )
Getting a driving license is no longer easy.
డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుకు ముందే ‘ఆన్లైన్ రోడ్డు భద్రత పరీక్ష’ తప్పనిసరి కానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. మూడు గంటల పాటు సాగే ఆరు వీడియో మాడ్యూల్స్
శిక్షణ పూర్తి చేస్తేనే ఎల్ఎల్ఆర్ దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టి, డ్రైవర్లలో క్రమశిక్షణ పెంచడమే ఈ కొత్త మూడు దశల విధానం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.రోడ్డు
ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవటమే కాదు. అంతకంటే ముందే రోడ్డు భద్రతపై అవగాహన పరీక్షను పాస్
కావాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత కఠినతరం కానుంది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ కసరత్తు చేస్తోంది.ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్
పొందడానికి ఎల్ఎల్ఆర్, ఫైనల్ డ్రైవింగ్ టెస్ట్ అనే రెండు దశలు ఉన్నాయి. ప్రతిపాదిత కొత్త విధానం అమల్లోకి వస్తే ఇది మూడు దశల ప్రక్రియగా మారుతుంది. దీని ప్రకారం.. అభ్యర్థి మొదట ఆన్లైన్ రోడ్డు భద్రతా
అవగాహన పరీక్షను పూర్తి చేయాలి. దీనిపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశామని.. ఏప్రిల్ నెలాఖరు నాటికి నివేదిక వస్తుందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ నివేదిక
ఆధారంగా ఈ పరీక్షను తప్పనిసరి చేస్తారు.ఈ ఆన్లైన్ శిక్షణ, పరీక్షా విధానం మొత్తం ఆరు మాడ్యూల్స్గా ఉంటుంది. ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాల పాటు, మొత్తం 3 గంటల సమయం పడుతుంది. ఇందులో
వీడియో ఆధారిత పాఠాలు, రోడ్డు భద్రతా క్రమశిక్షణ, ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ ఇస్తారు. ప్రతి మాడ్యూల్ చివరలో చిన్న పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు తమ ఇంటి వద్దనే కెమెరా ఉన్న ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా
ఈ పరీక్షను రాయవచ్చు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో హాజరు కావచ్చు.ఈ శిక్షణలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలు, అద్దాల వినియోగం, సురక్షితంగా ఓవర్టేకింగ్ చేయడం వంటి అంశాలను
వివరిస్తారు. వాస్తవ ప్రమాదాల వీడియోలను చూపిస్తూ డ్రైవర్లు చేసే పొరపాట్లపై అవగాహన కల్పిస్తారు. ఈ ఆన్లైన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఒక యూనిక్ సర్టిఫికేట్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబర్ ఉంటేనే
ఎల్ఎల్ఆర్ దరఖాస్తు చేసుకోవడానికి సాధ్యమవుతుంది.భారతదేశంలో ఏటా సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో కూడా మరణాల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ఈ
నేపథ్యంలోనే లైసెన్స్ జారీ చేసే ముందే రోడ్డు భద్రతపై ప్రాథమిక అవగాహన కల్పించడం వల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ డిజిటల్ విధానం వల్ల రవాణా
కార్యాలయాల్లో దళారీల ప్రమేయం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని రవాణా శాఖ ఆశిస్తోంది.



