ఆర్టీసీ ఉద్యోగులకు తియ్యటి శుభవార్త..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రెండు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసిన సర్కార్.. ఇటీవల పేదలకు ఎంతగానో ఉపయోగపడే రూ.500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేసింది. ఇప్పుడు తాజాగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు: మంత్రి పొన్నం
ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించామని.. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలులోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్త ఫిట్మెంట్తో ఆర్టీసీకి నెలకు రూ.35 కోట్ల భారం పడనుందని చెప్పారు. 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారని… విజయవంతం చేశారని కొనియాడారు. 3 నెలల్లో 25కోట్ల మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారన్నారు. అందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గతంలో ప్రావిడెంట్ ఫండ్ను వాడుకున్నారని.. బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ఇప్పుడు 2017 పీఆర్సీని పూర్తి స్థాయిలో ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ నష్టాల నుంచి ప్రాఫిట్ ఒరిఎంటేషన్ వైపుగా వెళ్తున్నాంమన్నారు. ఫైట్మెంట్ 21శాతం ఇవ్వాలని నిర్ణయించామని… దీనివల్ల ఏడాదికి భారం పడుతుంది.. అయినా కూడా ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.
అది వాస్తవం కాదు…
పేద ప్రజలకు ప్రయాణం సాధనం ఆర్టీసీ అన్నారు. ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బస్సుల కలర్స్ వేసి నడపుతున్నాం అనటం వాస్తవం కాదన్నారు. ఆటో కార్మికులకు కొంత అన్యాయం జరిగిందని.. వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారను. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా మాజీ మంత్రులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘‘గతంలో ఉన్న మాజీ మంత్రులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. కానీ మమ్మల్ని ఆటో కార్మికులకు 15000 ఇవ్వాలని కోరుతున్నారు’’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు.



