ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ రాష్ట్రంలో పలుచోట్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు అంశాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కట్టడి దిశగా చర్యలకు శ్రీకారం చుట్టడం ప్రస్తుతానికి ఫలితాలనిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల గనులశాఖపై నిర్వహించిన సమీక్షలో ఇసుక అక్రమ రవాణాపైనే ఎక్కువగా చర్చించారు. తాను పాదయాత్ర చేసినప్పుడు, ఇతర సందర్భాల్లో క్షేత్రస్థాయిలో గమనించిన అక్రమాలను సీఎం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన అంచనా ప్రకారం 25 శాతం అనధికారికంగా తరలివెళ్తోందని అన్నారు. రీచ్ల దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నవి పనిచేయకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. వేబ్రిడ్జిలు లేకపోవడం, ఒక పర్మిట్తో మూడు,నాలుగు లారీల్లో ఇసుక తీసుకెళ్లడం వంటివీ సమావేశంలో చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఇసుక రీచ్లు ఉన్నాయి. ఫలితంగా ఇసుక రీచ్లు లేనిచోట అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.
అక్రమాలను గుర్తించే చర్యలు
సమావేశం అనంతరం అధికారులు అక్రమాలను గుర్తించే చర్యలు చేపట్టారు. కామారెడ్డి, యాదాద్రి, మహబూబ్నగర్, సూర్యాపేట వంటి జిల్లాల్లో అక్రమరవాణా జోరుగా జరుగుతున్నట్టు గుర్తించారు. కరీంనగర్, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ వంటి జిల్లాల్లో టీఎస్ఎండీసీ రీచ్లు అసలే లేవని, దీంతో ఆయా జిల్లాల్లోని నదులు, ఉపనదుల నుంచి ఇసుక అక్రమంగా తరలుతోందని గుర్తించారు. మంజీరా, గోదావరి, మూసీ, దుందుభి నదీ పరీవాహక ప్రాంతాల నుంచి స్థానికావసరాల పేరుతో ఇసుకను తరలించి ఓచోట నిల్వచేసి, అక్కణ్నుంచి లారీల్లో నగరాలకు రవాణా చేస్తున్నారని, ఫలితంగా సర్కారు ఆదాయానికి భారీగా గండి పడుతోందని తేల్చారు. అడ్డుకట్ట వేసే దిశగా అనేక చర్యలు చేపట్టారు. ఇసుక రీచ్లు లేని జిల్లాల్లో ఏర్పాటు చేయడం.. ఇప్పటికే ఉన్నచోట మరిన్ని తెచ్చే దిశగా టీఎస్ఎండీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు.



