
జులై , 2023, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ చందాదారులపై మరోమారు ఏపిసిఐడి తమ అక్కసును వెళ్లగక్కుతూ శుక్రవారం మరోమారు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మార్గదర్శి కంపెనీపై పదేపదే ఆరోపణలు చేయటం పూర్తిగా కక్షసాధింపు చర్యగానే బావించవచ్చు. చందాదారులను భయకంపితులను చేసేందుకు, చందాదారులను భయపెట్టేందుకు మార్గదర్శి కంపెనీపై ఏపిసిఐడి ఎస్పీ అసత్య ఆరోపణలు చేయటం గమనార్హం.
ముందుగా విడుదల చేసిన జీవోకు అదనంగా G.O.Ms నెంబర్ 134 ఉపయోగించి ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఉషాకిరోన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో కంపెనీ పెట్టుబడులు రూ. 15.81 కోట్లు అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించటం జరిగింది. వాస్తవానికి 29.05.2023, 15.06.2023 జారీ చేసిన జీవో నెంబర్ 104, జీవో నెంబర్ 116 ప్రకారం ఇప్పటికే రూ.793 కోట్లు మరియు రూ.242 కోట్లు న్యాయస్థానం పరిధి మేరకు అటాచ్ చేయటం జరిగింది. ఇదే విషయాన్ని ఏపీసిఐడి పదేపదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ చందాదారులను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ విషయంపై గౌరవ న్యాయస్థానం మధ్యంతర ఉపశమనం కల్పించినప్పటికి తప్పుడు సమాచారంతో చందాదారులను భయపెట్టే ప్రయత్నంలో ఏపీసిఐడి కంపెనీపై కక్ష సాధింపులకు పాల్పడుతుంది.
కంపెనీ ప్రతిష్టను దిగజార్చే ఏకైక ఎజెండాతోపాటు ఎలాంటి చెల్లింపు డిఫాల్ట్ లేకుండా విజయవంతంగా చందాదారులకు నమ్మకంగా నిర్వహిస్తున్న మార్గదర్శి వ్యాపారాన్ని అప్రతిష్టపాలు చేయటానికి ఏపీసిఐడి ప్రయత్నిస్తుంది. ఏపిసిఐడి చందాదారులను భయపెట్టేందుకు కంపెనీపై చేస్తున్న ఆరోపణలన్నింటినీ మార్గదర్శి మరోసారి నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది. చందాదారుల్లో మార్గదర్శిపై ఉన్న నమ్మకాన్ని ఎదుర్కొనలేక ప్రజలలో మార్గదర్శిపై గందరగోళానికి గురిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సిఐడితో పదేపదే ఇటువంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతుంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం హడావుడిగా పైన పేర్కొన్న మూడు జీవోలను జారీ చేసింది. ఇందులో చందాదారుల డబ్బు నయాపైసా లేకున్నా, సంస్థ స్థిర డిపాజిట్లు మరియు అరవై సంవత్సరాలలో కంపెనీ ఆర్జించిన లాభాలను అటాచ్ చేయటం ద్వారా ప్రభుత్వం ఎంతటి కక్షసాధింపుకు పాల్పడుతుందో తేటతెల్లం అవుతుంది.
ఏపిపిడిఎఫ్ఈ నిబంధనలు చిట్ ఫండ్ వ్యాపారంలో ఉన్న కంపెనీకి వర్తించవు. కానీ ఏపిసిఐడి చట్టాలకు విరుద్ధంగా మార్గదర్శి కంపెనీపై దర్యాప్తు చేపట్టింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. మార్గదర్శి నాన్ బ్యాంకింగ్ కంపెనీ, చిట్ ఫండ్స్ యాక్ట్ 1982 నిబంధనల పరిధిలోకి వస్తుంది. అన్ని లావాదేవీలు స్వీయ నియంత్రణ చట్టం ద్వారా నిర్వహించబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45-I (బిబి)లో స్పష్టంగా వివరించిన విధంగా సబ్స్క్రిప్షన్లు డిపాజిట్లుగా పరిగణించబడవు. కానీ చట్టంలోని నిబంధనలపై పూర్తి అవగాహనలేమితో ఏపిసిఐడి దరుద్దేశపూర్వకంగా మీడియాలో ద్వారా కంపెనీపై తప్పుడు ప్రకటనలు చేస్తుంది. అందేకాకుండా చట్టపరంగా ఆమోదయోగ్యంకాని చర్యలను సమర్థించుకుంటుంది. ఇదంతా గత అరవై సంవత్సరాల “మార్గదర్శి” బ్రాండ్ను విశ్వసిస్తున్న చందాదారుల భయాందోళనకు గురిచేసేందుకు యాజమాన్యంపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులతో సిఐడి నేరారోపణలు చేస్తుంది.
ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్లు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న చిట్ గ్రూప్ల మూసివేత ఆదేశాలు జారీ చేయడానికి పూర్తిగా కఠినమైన చర్యలకు పాల్పడ్డారు. అయితే చందాదారులు భవిష్యత్ ఆందోళనతో గౌరవనీయ హైకోర్టును సంప్రదించారు. అంతేకాక రిజిస్ట్రార్లు విడుదల చేసిన చిట్ మూసివేత ఉత్తర్వులు తమ ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తాయని, దురుద్ధేశపూర్వకంగానే ఈ ప్రణాళికాబద్ధమైన దాడి నుంచి విముక్తి కలిగించాలని గౌరవనీయ హైకోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ల మూసివేత ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయటమే కాకుండా ఆ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు, పిటిషనర్ల ప్రయోజనాలకు విరుద్ధమని సమర్థించారు.
గౌరవనీయ ఏపి హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ఆగ్రహించిన సిఐడి అధికారులు, వారు చిట్ గ్రూపులను మూసివేస్తూ జారీచేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్లు దాఖలు చేసిన చందాదారులను బెదిరిస్తున్నట్లు సమాచారం. సిఐడి వారు చందాదారుల వ్యాపారం/వృత్తి, ఆదాయ వనరులు, వ్యక్తిగత KYC మరియు గోప్యత యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ మరియు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో సహా అనేక ఇతర వ్యక్తిగత వివరాలను కూడా కోరుతున్నారు. సిఐడి ఆదాయపు పన్ను, జిఎస్టి మరియు దర్యాప్తుకు సంబంధం లేని అనేక ఇతర చట్టాల నిబంధనల ప్రకారం వివరాలను కూడా కోరుతోంది. ఈ చందాదారులు ఏపి ప్రభుత్వ పరిపాలనలోని అన్ని ఏజెన్సీలచే వేదించబడుతున్నారు మరియు వారిలో కొంతమంది బలవంతంగా వారి పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.
న్యాయం జరిగేలా సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని సీఐడీ ఎస్పీ ప్రస్తావిస్తున్నప్పటికీ, గౌరవనీయ తెలంగాణ హైకోర్టు మరియు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి మధ్యంతర ఉత్తర్వులను నిర్మొహమాటంగా విస్మరించి కంపెనీ కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు అన్యాయమైన, నిర్బంధ చర్యలకు పాల్పడుతున్నారు.
గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమ 26.12.2022 నాటి ఉత్తర్వుల్లో రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ల స్వీకరణ, భద్రతను విడుదల చేయడం వంటి ప్రక్రియకు కట్టుబడి ఉండాలని రిజిస్ట్రార్లను ఆదేశించింది. రిజిస్ట్రార్లు రూ. 70 కోట్లు కంటే ఎక్కువ FDRల విడుదలను నిలుపుదల చేసినందున చట్టంలోని నిబంధనలకు అనుసరించడంలో ఘోరంగా విఫలమైనట్టు పేర్కొన్నారు.
ఇంకా గౌరవనీయ తెలంగాణ హైకోర్టు WP నెం. 7626 / 2023, 7629 / 2023, 10350 / 2023 ప్రకారం వారి మధ్యంతర ఆదేశాలలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, బ్రాంచ్ మేనేజర్లు మరియు సీనియర్ సిబ్బందికి వ్యతిరేకంగా ఎటువంటి బలవంతపు చర్యలకు పాల్పడరాదని ఆదేశాలు జారీ చేస్తూ ఉపశమనం కలిగించారు.
అలాగే గౌరవనీయ తెలంగాణ హైకోర్టు WP 13199 ద్వారా పిటిషనర్ సంస్థ యొక్క వివిధ శాఖలలో రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం లేదా భంగం కలిగించవద్దని, భవిష్యత్తులో, పైన పేర్కొన్న ఏదైనా నేరాలలో ఏదైనా శోధన కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు పిటిషనర్ కంపెనీ యొక్క శాఖల ప్రధాన ద్వారం మూసివేయండి అని ఏపిసిఐడి మరియు ఇతర ప్రతివాదులను ఆదేశిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
గౌరవనీయ తెలంగాణా హైకోర్టు 26.06.2023న మా కేసును విచారిస్తున్నప్పుడు ఏపిసిఐడి “మీడియా ట్రయల్స్” నిర్వహించకూడదని చెప్పినప్పటికి కూడా, సిఐడి ఎస్పీ వారు గౌరవనీయ న్యాయస్థానం వారి పరిశీలనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. చందాదారులను తప్పుదారి పట్టించేందుకు నిరాధారమైన ఆరోపణలను తెలియపరుస్తున్నారు మరియు ఇప్పటికీ కేసు పూర్వపరాలు సబ్-జ్యూడీస్ గా ఉన్న విషయం గమనార్హం.
అంతేకాకుండా, దర్యాప్తులో ఉన్న కేసుకు సంబంధించి పోలీసు అధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రసారం చేయడం మానుకోవాలని గౌరవనీయ న్యాయస్థానం వారు పేర్కొన్నారు. ఒక వ్యక్తిని సమర్థ అధికార పరిధి కలిగిన కోర్టు దోషిగా నిర్ధారించే వరకు, అటువంటి వ్యక్తి అమాయకత్వం కాపుడు రక్షణను పొందుతాడు, అది ఉల్లంఘించబడకుండా చూసుకోవడం ప్రతివాది యొక్క బాధ్యత.
చిట్ ఫండ్స్ చట్టం లేదా కంపెనీల చట్టం లేదా ఆదాయపు పన్ను చట్టంలోని ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని కంపెనీ మరోసారి పునరుద్ఘాటించింది. బహుమతి చెల్లింపులు ఎల్లప్పుడూ సకాలంలో జరుగుతాయి మరియు చందాదారులకు చెల్లించాల్సిన మొత్తం సంబంధిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడతాయి.



