నువ్వా నేనా అన్నట్టుగా సభలు, సమావేశాలు…
ప్రజల నాడి ఎటువైపో…
గెలుపు ధీమాలో పార్టీలు..
బిజెపికి బీసీ సీఎం మంత్రం గెలిపించేనా….
పెద్దపల్లి: రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయా పార్టీల ప్రచారాలు తారస్థాయికి చేరాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకత్వం పలుమార్లు ప్రచార హోరుతో ప్రజల ముందుకు వచ్చారు. సభలు సమావేశాలకు ప్రజలను అధిక సంఖ్యలో తరలించడంలో ఆయా పార్టీల అభ్యర్థులు విజయవంతమయ్యారు. ఇక మిగిలిన తర్వాయి వారిని ఓటర్లుగా మార్చుకోవడంలోనే ఉంది. ప్రస్తుతం ఏ పార్టీకి చూసినా ప్రజలు అధిక సంఖ్యలో సభలకు రావడం పట్ల సంతోషంగానే ఉన్న వారిని ఓటర్లుగా మార్చుకోవడంలోనే విజయం దాగి ఉందనే సత్యం వారికి కూడా తెలుసు. ఇక వారికి మిగిలింది చివరి అస్త్రమైన ప్రలోభాల బ్రహ్మాస్త్రం. ఇప్పటికే నియోజకవర్గంలోకి మద్యం డబ్బు వచ్చి చేరిందని ప్రచారం జోరుగా సాగుతున్నది. ఓ పార్టీ ప్రతినిధి ఏకంగా ఓటుకు 2 వేల రూపాయలను ఓటర్ కు ఇచ్చి ప్రమాణం చేయించుకుంటున్నాడని ప్రచారం కూడా సాగుతున్నది. అయితే సదరు ఓటర్లు దానిని తిరస్కరించినట్లుగా తెలిసింది. కాగా ఓ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓటుకు 6000 ఇస్తున్నట్టుగా ప్రచారం గుప్పు మంటుంది. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఎస్పీ, టీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీఎస్పీలో చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నా యనే చెప్పాలి. బిజెపి విషయానికి వస్తే చాలా ఆలస్యంగా ప్రచారం దిగిన ఎక్కడ కూడా తమ ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. బీసీ సీఎం మంత్రం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి. బిజెపి నుండి కిందిస్థాయి నాయకత్వం పలువురు ఆయా పార్టీల్లో చేరిపోయారు. ఒక వార్డ్ కౌన్సిలర్ కూడా బీఎస్పీలో చేరగా బీజేవైఎం నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారం వరకు బిజెపి అన్ని స్థాయిలో విఫలం చెందిందని ఆ పార్టీ నాయకులే ప్రచారం చేస్తున్నారు. ప్రధాన సభలు ఎక్కడ కూడా ఇప్పటివరకు నియోజకవర్గంలో జరగలేదు. ఇక మిగిలింది చివరి నాలుగు రోజులు మాత్రమే. టిఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తరఫున ఇప్పటికే హోం మంత్రి మహమ్మద్ అలీ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దాసరి గెలుపునకు రాగా ఎమ్మెల్సీ కవిత రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయ రమణ రావుకు రేవంత్ రెడ్డి, దాసరి ఉషకు యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పాల్గొన్నారు. ఈసారి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదన్నట్టుగా ప్రచారం సాగుతున్నది. అన్ని పార్టీల నాయకులు ఆత్మీయ సమ్మేళనాలు, ఆయా సంఘాలు, కుల సంఘాలు, యూనియన్ నాయకులతో సంప్రదింపులు సమావేశాలు సాగుతున్నాయి. ఏది ఏమైనా ప్రజలకు అభివృద్ధిని చూపిస్తే ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అభివృద్ధి అంటే రోడ్డు వేయడం విద్యుత్ దీపాలు పెట్టించడం కాదని, ప్రజల జేబుల్లోకి నాలుగు డబ్బులు మిగిలేలా చేయాలని ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తే ప్రజలకు అంతకుమించిన అభివృద్ధి ఉండదని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అవినీతి, బంధుప్రీతి లేని రాజకీయాలు సమసిపోయి ప్రజలకు మేలు చేసే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు.



