హంద్రీనీవా ఎత్తిపోతల పధకం ప్రారంభం
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

కర్నూలు, సెప్టెంబర్ 19: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరంలో రూ. 224.31 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. కరువు సీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా10,394 ఎకరాలకు సాగునీరు, డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజక వర్గాల్లోని ప్రజలకు త్రాగునీరు అందనుంది. డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు హంద్రీనీవా నీటిని మళ్లించి కరువు సీమ దాహార్తి తీర్చడంతో పాటు కృష్ణా జలాలతో సస్యశ్యామలం అవనున్నాయి. ‘రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు తీసుకున్నా. గతంలో డోన్లో ఒక్క ఎకరం కూడా ఇరిగేషన్లో లేదు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను అస్సలు పట్టించుకోలేదు. ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో మేలు జరుగుతుంది రూ. 253 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేశాం. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకున్నాం’ అని అన్నారు.

‘హంద్రీనీవాను దివంగత నేత వైఎస్సార్ పూర్తి చేశారు. వెలుగొండ ప్రాజెక్టును వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్లో ప్రారంభిస్తున్నాం. మహానేత వైఎస్సార్ బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది. అబద్ధాలు, మోసాలను ప్రజలు ఏమాత్రం నమ్మవద్దు. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? లేదా? అన్నది ఆలోచించండి. ఇప్పుడు మీ బిడ్డ ఎందుకు ఇన్ని పనులు చేయగలుగుతున్నాడు.. నారా చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అప్పుడు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. అప్పటికంటే అప్పులు తక్కవ చేశాం. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ ఉండదు.బాబు మంచిని ఎప్పుడూ నమ్ముకోలేదు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.అంతకు ముందు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్కు ఘన స్వాగతం లభించింది. కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ సీఎంకు ఘన స్వాగతం పలికారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మొదటి దశలో కర్నూలు జిల్లాలోని మెరక ప్రాంతాల్లో ఉన్న 77 చెరువులకు తాగు, సాగునీరు సరఫరా జరుగుతుంది. డోన్ నియోజకవర్గంలో 36 చెరువుల క్రింద 4,260 ఎకరాలు, పత్తికొండ నియోజకవర్గంలో 36 చెరువుల క్రింద 5,784 ఎకరాలకు నీరు అందుతుంది. ఆలూరు నియోజకవర్గంలో 3 చెరువులక్రింద 197 ఎకరాలు, పాణ్యం నియోజకవర్గంలోని 2 చెరువుల క్రింద 153 ఎకరాలు మొత్తం 77 చెరువుల క్రింద 10,394 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల ద్వారా 4 నియోజక వర్గాలలోని ప్రజలకు తాగునీరు.. భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు పుష్కలంగా పంటలు పండే అవకాశం లభిస్తుంది. వర్షాధారం మీద ఆధారపడిన కర్నూలు జిల్లా పశ్చిమ కరవు ప్రాంతంలోని రైతులకు చెరువులు నింపే కార్యక్రమం అని ప్రభుత్వం చెబుతోంది. హంద్రీ నీవా ప్రధాన కాలువపై కూర్మగిరి (అలంకొండ) వద్ద పంప్ హౌస్ నిర్మాణం చేపడతారు. 3X3, 800 HP మోటార్ల ద్వారా 1.4 టీఎంసీల నీటిని 90 రోజులలో పంప్ చేసి 5.6 కిలోమీటర్లు ప్రెషర్ మెయిన్ ద్వారా కొండపై ఉన్న డెలివరి ఛాంబర్కు నీటి మళ్లించి మూడు గ్రావిటీ పైప్ లైన్ల ద్వారా నీటి మళ్లింపు సరఫరా చేస్తారు. గ్రావిటీ పైప్ లైన్-1 ద్వారా 22 చెరువుల క్రింద 4,217 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. గ్రావిటీ పైప్ లైన్-2 ద్వారా 16 చెరువుల క్రింద 3,018 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. గ్రావిటీ పైప్ లైన్ – 3 ద్వారా ప్యాపిలీ బ్రాంచ్ ద్వారా 23 చెరువుల క్రింద 2,065 ఎకరాల ఆయకట్టుకు, జొన్నగిరి బ్రాంచ్ ద్వారా 7 చెరువుల క్రింద 830 ఎకరాల ఆయకట్టుకు సాగునీరిస్తారు. మొదట నిర్దేశించిన 68 చెరువులతో పాటు డోన్ నియోజకవర్గంలో 8, పత్తికొండ నియోజకవర్గంలో ఒకటి.. మొత్తం 9 చెరువులకు పైప్ లైన్ ద్వారా అదనంగా నీరు అందించే ఏర్పాటు చేశారు.



