ఎన్టీఆర్ నగర్ ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తా
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
మహేశ్వరం నియోజకవర్గంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని మహేశ్వరం నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి అన్నారు. బీఎస్పీ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొత్త మనోహర్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ నగర్ ప్రజలను దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అదేవిధంగా మండలానికో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని అన్నారు. నియోజకవర్గానికి పీజీ కాలేజీ తీసుకువచ్చేందుకు తనవంతు పాటుపడతానని భరోసా కల్పించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నిటినీ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు. తనకు బీఎస్పీ మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్టు కేటాయించినందుకు బీఎస్పీ అధినేత్రి బెహన్ మాయావతి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులకు కొత్త మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరి మహారాజ్, లింగం స్వెరో, మహేష్ చారి, శ్రీనివాస్, రాజు, ఇందుమతి, స్వప్నయాదవ్, నర్సింహ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.