జర్నలిస్టు నేతకు మాతృ వియోగం
-నివాళులర్పించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
హైదరాబాద్ బ్యూరో, డిసెంబర్ 29: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవతెలంగాణ సీనియర్ జర్నలిస్టు బొడిగె బసవపున్నయ్య మాతృ మూర్తి బొడిగె ఊషమ్మ(80) శనివారం ఉదయం హైదరాబాద్ లో మరణించారు. ఇటీవల ఆమె ఇంట్లో బాత్రూమ్ లో జారి పడడంతో తలకు బలమైన గాయమైంది. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఊషమ్మకు భర్త బొడిగె లక్ష్మయ్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వనస్థలిపురంలోని హుడా సాయినగర్ గల ఆమె పెద్ద కొడుకు సుందరయ్య ఇంటివద్ద ఊషమ్మ బౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మహానది పత్రిక ఎడిటర్ మామిడి సోమయ్య ఊషమ్మ బౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సీపీఎం సీనియర్ నాయకులు చెరుపల్లి సీతరాములు, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్, హెచ్ యూజే నాయకులు జగదీష్, పద్మరాజు, ఉదయభాస్కర్ రెడ్డి,మధూకర్, ప్రశాంత్, నవ తెలంగాణ సీనియర్ ఫోటో జర్నలిస్టు హరి తదితరులు ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సాయంత్రం ఊషమ్మ అంతిమ యాత్ర నిర్వహించి, సాహెబ్ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. ఆమె చిన్న కొడుకు బసవపున్నయ్య తలకొరివి పెట్టి చితికి నిప్పంటించారు.



