అగ్రరాజ్యానికి కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 29, (వాయిస్ టుడే)
KCR Go America
బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా అడుగులు వేయకుంటే పార్టీ మటాష్ అవుతుందని భావించారట పెద్దాయన. ఆ విధంగా అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. బీసీల అంశం పార్టీలో ఏ మాత్రం ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో పాత అంశాలను ప్రస్తావించినట్టు కొందరు నేతలు చెబుతున్నారు.పార్టీలో ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కరే ఉన్నారు. ఆ సంఖ్యను నాలుగుకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారట పార్టీ అధినేత. ఇప్పటివరకు కేటీఆర్ ఒక్కటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేవారు. కేటీఆర్తోపాటు మరో ముగ్గురికి అవకాశం కల్పించనున్నా రట. వారిలో మహిళలకు ఎక్కువగా ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల మాట. ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ, ఇంకొకరు టాప్ కమ్యూనిటీకి చెందిన మహిళ ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇంతలా దిగజారి పోవటానికి మీరే కారణమని కొందరు సీనియర్లు తప్పుబట్టారని తెలుస్తోంది. తొలుత ఇంటి సమస్యలు సరిదిద్దుకుంటే, ప్రత్యర్థులకు ధీటుగా బదులు ఇవ్వవచ్చని చెప్పినట్టు సమాచారం. ఒకానొక దశలో యువనేతపై కేసీఆర్ కాసింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల మాట. ఇంటిని చక్కదిద్దుకునే పనిలో భాగంగా హాజరైన నేతల నుంచి అభిప్రాయసేకరణ చేశారు.పార్టీలకు అనుగుణంగా బహిరంగ సభ నిర్వహణ, కొన్ని కమిటీలకు ఇన్ఛార్జ్గా హరీష్రావుకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఆ విషయాన్ని మీడియా సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. గత ఎన్నికల్లో మహిళలు బీఆర్ఎస్ను చావదెబ్బ కొట్టారని కేసీఆర్కు పలు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో పార్టీలో మహిళలకు పెద్ద పీఠ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానికి అధ్యక్షురాలిగా కవితను నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.మరోవైపు కేసీఆర్ అమెరికా టూర్ వెళ్లాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల మాట. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కమిషన్ నివేదిక తుది దశకు చేరింది. రేపో మాపో రేవంత్ ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా టూర్కి శ్రీకారం చుట్టడంపై పలు అనుమానాలు మొదలయ్యాయి. ఇందులోభాగంగా ఫామ్ హౌస్ నుంచి పార్టీ ఆఫీసుకు వెళ్లకుండా కేసీఆర్ పాస్పోర్టు ఆఫీసుకు వెళ్లారని అంటున్నారు.ప్రభుత్వం మారిన వెంటనే డిప్లమాటిక్ పాస్పోర్టును అప్పగిస్తారు మాజీ ముఖ్యమంత్రులు. ఏడాది తర్వాత డిప్లమాటిక్ పాస్పోర్టు ఇవ్వరని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ జగన్ విషయాన్ని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ అమెరికాలో ఉండేందుకు రెండునెలలుగా తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ ఫారెన్ టూర్ వెళ్లడం పక్కాగా ఖాయమన్నమాట.