గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ తన పురిటిగడ్డ సిద్దిపేటలో నేడు అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కాకున్నారు. దాదాపు లక్ష మంది జనసమీకరణతో సభను నిర్వహించి, సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదని చాటేందుకు BRS పార్టీ సిద్ధమవుతోంది.
ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేటకి రానున్నారు. సిద్దిపేట వేదికగా జరుగనున్న ఈ సభకు సీఎం కేసీఆర్ రానున్నడంతో ఈ సభపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సిద్దిపేట అంతా గులాబీమయంగా మారింది. సభ జరిగే ప్రదేశంతో పాటు సిద్దిపేట పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు భారీ కట్ అవుట్ లు వెలిశాయి. భారీ జనసమీకరణే లక్ష్యంగా మండలాలు, గ్రామాల వారీగా ఇన్చార్జీలను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన తర్వాత సిద్దిపేటలో నిర్వహించే మొదటి సభ, సీఎం కేసీఆర్ పురిటిగడ్డపై నిర్వహించే సభ కావడంతో గులాబీ పార్టీ నేతలు, శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాన్నారు. ఈ సభకి లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు

సిద్దిపేట మట్టి బిడ్డ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రజాఆశీర్వాద సభను లక్ష మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నియోజక వర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి 20వేల మంది యువకులు మోటార్ సైకిళ్లపై సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని మంత్రి తెలిపారు.
మంత్రి హరీష్ రావు
మరో వైపు సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సభాస్థలి, పార్కింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ తదితర ప్రాంతాలను పోలీస్ అధికారులతో కలిసి సీపీ శ్వేత సందర్శించారు. ఈ సభ నేపథ్యంలో అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బందితో 6 సెక్టార్లుగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నాం నుంచి రాత్రి 7.30 వరకు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షాలుంటాయనీ, ఇందుకు సహకరించాలని ప్రజలను పోలీసులు కోరారు.



