తిరుచానూరులో వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర
Lakshmi Kasulaharam Shobhayatra in Tiruchanur
– గజ, గరుడ వాహనాల్లో అమ్మవారికి అలంకరణ
– టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు
తిరుపతి,
తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం – పసుపుమండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, శ్రీవారి ఆభరణాలలో లక్ష్మీ కాసులహారం అత్యంత ప్రధానమైందని, పౌర్ణమి గరుడసేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్పస్వామివారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడవాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సోమవారం రాత్రి జరుగనున్న గజ వాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



