రంగారెడ్డి అక్టోబర్ 27 వాయిస్ టుడే ప్రతిని: మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నలుగురు ఆశావహుల మధ్య పోటీ నెలకొనగా.తాజాగా మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. తాండూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన ఆయనను మహేశ్వరం బరి లో నిలవాలని అధిష్టానం ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హస్తినలో ఆయన కాంగ్రెస్ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మారిన సమీకరణల నేపథ్యంలో తాండూరు స్థానానికి డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినందున.. మహేశ్వరం నుంచి రంగంలోకి దిగాలని సూ చించినట్లు సమాచారం. అధిష్టానం సూచనకు అయిష్టంగానే అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం వెలువడే కాంగ్రెస్ మలి జాబితాలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితారెడ్డి కుటుంబంతో రాజకీయ వైరం కలిగిన కేఎల్లార్ను ఇక్కడి నుంచి పోటీలో నిలపడం ద్వారా బలమైన అభ్యర్థిని నిలువరించవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పారిజాతను కాదని..
ఇదిలావుండగా మహేశ్వరం సీటుకు కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, సీనియర్ నేతలు ఏనుగు జంగారెడ్డి, దేప భాస్కర్రెడ్డి, అమరేందర్రెడ్డి పోటీ పడుతుండగా.. కొన్ని నెలల క్రితం పార్టీలో తిరిగి చేరిన బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత పేరును అధిష్టానం పరిశీలించింది. ఆమె అభ్యర్థిత్వానికే దాదాపు మొగ్గు చూపింది. పారిజాతకు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆశావహులు నలుగురు ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ఇదే విషయం స్పష్టం చేశారు. సహాయ నిరాకరణ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. దీంతో పునరాలోచనలో పడ్డ అధిష్టానం తొలి జాబితాలో మహేశ్వరం అభ్యర్థిని పెండింగ్లో పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీ తీర్థం పుచ్చుకున్న మనోహర్రెడ్డి పేరు తాండూరు స్థానానికి పరిగణనలోకి తీసుకోవడంతో కేఎల్లార్ను ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలనే అంశం చర్చకు దారితీసింది. తాండూరు సీటుపై పంతం వీడకుండా మొండికేసిన ఆయనను ఎట్టకేలకు పీసీసీ పెద్దలు బుజ్జగించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కృషి చేస్తున్న పారిజాత పేరును పరిశీలించాలని.. తాను పార్లమెంటు బరిలో ఉంటానని అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. ఒకవేళ కాదు కూడదంటే పోటీ చేయడానికి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. కేఎల్లార్ మహేశ్వరం నుంచి పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.



